IPL | ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి అదరగొట్టింది. నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ను చిత్తుచేసిన బెంగళూరు.. తాజాగా అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్కు చుక్కులు చూపించింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఊదేసింది. ఛేదనలో రారాజు కోహ్లీ మరోసారి మెరవగా విల్ జాక్స్ సిక్సర్ల సునామీతో 41 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అంతకుముందు గుజరాత్ తరఫున సాయి, షారుక్ ఖాన్లు రాణించినా ఆ జట్టు బౌలర్లు విఫలమయ్యారు.
అహ్మదాబాద్: ఐపీఎల్-17 సీజన్ తొలి అంకంలో ఆరు మ్యాచ్లు ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్ గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ను వాళ్ల సొంతగడ్డలో 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ.. మరో 24 బంతులు మిగిలుండగానే ఊదేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 10 సిక్సర్లు) నరేంద్ర మోడీ స్టేడియంలో సిక్సర్లతో హోరెత్తించి అజేయ శతకం సాధించగా విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. గిల్ (16) మరోసారి విఫలమయ్యాడు. కానీ వన్డౌన్ బ్యాటర్ సాయి, బ్యాటింగ్లో ప్రమోషన్ పొందిన షారుక్ ఆర్సీబీ బౌలర్లను దంచికొట్టారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగింది. షారుక్ ఔట్ అయినా మిల్లర్ (19 బంతుల్లో 26 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి సాయి గుజరాత్ స్కోరును 200 మార్కుకు చేర్చాడు.
భారీ ఛేదనను ఆర్సీబీ ధాటిగానే ఆరంభించింది. ఫాఫ్ డుప్లెసిస్ (12 బంతుల్లో 24, 1 ఫోర్, 3 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించి కోహ్లీతో కలిసి తొలి వికెట్కు 3.5 ఓవర్లలోనే 40 పరుగులు జోడించాడు. ఫాఫ్ ఔట్ అయ్యాక గుజరాత్ బౌలర్లపై కోహ్లీ ఎదురుదాడికి దిగాడు. 32 బంతుల్లోనే కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తయింది. ఇక క్రీజులో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడిన జాక్స్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 148/1 కాగా మిగిలిన 2 ఓవర్లలో జాక్స్ విధ్వంసరచనకు తెరతీశాడు. మోహిత్ శర్మ 15వ ఓవర్లో 4, 6, 6, 6, 4తో 29 పరుగులు రాబట్టిన అతడు.. రషీద్ ఖాన్ 16వ ఓవర్లో 6, 6, 4, 6, 6 తో 41 బంతుల్లో శతకాన్ని పూర్తిచేయడమే గాక మ్యాచ్నూ ముగించాడు. తొలి 29 బంతుల్లో 44 పరుగులే చేసిన జాక్స్.. ఆ తర్వాత 11 బంతుల్లోనే 56 రన్స్ దండుకున్నాడు. ఇందులో 7 సిక్సర్లున్నాయి. రెండో వికెట్కు ఈ జోడీ 12.1 ఓవర్లలోనే 156 పరుగులు జోడించింది.
5 జాక్స్ సెంచరీ ఐపీఎల్లో ఐదో వేగవంతమైన శతకం. గేల్ (30), పఠాన్ (37), మిల్లర్ (38), ట్రావిస్ హెడ్ (39)లు జాక్స్ కంటే ముందున్నారు.
గుజరాత్: 20 ఓవర్లలో 200/3 (సాయి 84 నాటౌట్, షారుక్ 58, స్వప్నీల్ 1/23, మ్యాక్స్వెల్ 1/28).
బెంగళూరు: 16 ఓవర్లలో 206/1 (జాక్స్ 100 నాటౌట్, కోహ్లీ 70 నాటౌట్, కిషోర్ 1/30)