సూర్యాపేట, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఆయన స్వయంగా ఇరిగేషన్ శాఖకు మంత్రి.. ఏ ప్రాజెక్టు కింద ఎంత సాగు? ఏ జిల్లాలో ఎంత పంట పండింది? అన్న సమాచారం తెలిసి ఉండాలి. కానీ, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, కనీస అవగాహన లేకుండా అబద్ధాలతో ప్రజల్లో పలుచన అవుతున్నారు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి. సూర్యాపేట జిల్లా పరిధిలో గోదావరి జలాల ఆయకట్టు అధికారిక లెక్కల ప్రకారం.. దాదాపు 2.60 లక్షల ఎకరాలు ఉండగా 2017 వరకు బావులు, బోర్ల కింద 55 వేల ఎకరాలకు మించి సాగుకు నోచుకోలేదు. 2018 నుంచి కాళేశ్వరం జలాలు రావటంతో ఏకంగా 2.58 లక్షల ఎకరాలకు చేరుకొన్నది. ఈ లెక్కన కాళేశ్వరం జలాలు వచ్చిన తర్వాత జిల్లాలో ప్రతి సీజన్కు పెరిగిన సాగు విస్తీర్ణం 2.03 లక్షల ఎకరాల చొప్పున ఏటా 4.06 లక్షలు. అంటే ఐదేండ్లలో సాగైన భూమి దాదాపు 20 లక్షల ఎకరాలు. కానీ, ఐదేండ్లలో మొత్తంగా కాళేశ్వరం జలాలతో సాగైంది కేవలం 6.50 లక్షల ఎకరాలే అని మంత్రి ఉత్తమ్ అనటం గమనార్హం.
కాలువల్లో నిరంతర జలాలు
కాళేశ్వరం జలాలను ఐదేండ్ల పాటు ఏటా రెండు సీజన్లల్లో ప్రతి సీజన్కు కాలువల్లో 1,200 నుంచి 1,700 క్యూసెక్కుల చొప్పున అవసరాన్ని బట్టి సీజన్కు 65 రోజుల నుంచి 100 రోజుల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేశారు. బయ్యన్న వాగు నుంచి కాలువల ద్వారా నేరుగా పంట పొలాలకు సీజన్కు 12 క్యూసెక్కులతో పాటు జిల్లాలోని గోదావరి జలాల ఆయకట్టు పరిధిలోని దాదాపు 650 చెరువులు, కుంటలు నింపేందుకు మరో 2 టీఎంసీలు మొత్తం కలిపి ఒక్కో సీజన్కు 12 నుంచి 15 టీఎంసీల చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు కలిపి దాదాపు 24 నుంచి 30 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
కాళేశ్వరంపై తొలి నుంచీ అక్కసే
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైనప్పటి నుంచి కాంగ్రెస్ కడుపు కుతకుత ఉడుకుతున్నది. రైతుల కడుపు నిండుతున్నదనే సంతోషం కనిపించకపోగా, ఆ పార్టీ కడుపు మండుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం వచ్చి ఊహించిన రీతిన వరిసాగు పెరిగి దేశానికే అన్నం పెట్టే స్థాయికి వచ్చినప్పటికీ ఆ పార్టీ బుద్ధి మారటం లేదు. తప్పుడు మాటలు వదలటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఏటా 1.30 లక్షల ఎకరాల చొప్పున ఐదేండ్లలో 6.50 లక్షలకు మించిలేదని ఉత్తమ్ ఇటీవల ఓ స్క్రీన్ ఏర్పాటు చేసి ఓ కట్టుకథను అల్లి చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి గమనిస్తే సూర్యాపేట జిల్లాలోనే గత ఐదేండ్లలో కలిపి సాగైన మొత్తం విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు. మరి మంత్రి ఉత్తమ్ చెప్పే లెక్క ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తరువాత దాని పరిధిలో ఏటా 1.30 లక్షల చొప్పున ఐదేండ్లలో 6.50 లక్షల ఎకరాలే పండాయని చెప్పటం ఆయన మాటలు అబద్ధమని తేటతెల్లమవుతున్నది. వాస్తవానికి గ్రామాలకు వెళ్లి నీళ్లు ఎప్పటి నుంచి వస్తున్నాయని తెలుసుకుంటే కాంగ్రెస్కు నిజం తెలుస్తుంది.ఎన్ని లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయో తేలుతుంది. రూ.వేల కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే చిన్న బరాజ్లను మరమ్మతులు చేయించలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాలు మాని యుద్ధప్రాతిపదికన పనులు చేయించి తమను అదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నాలుగు ఎకరాలు సాగుచేస్తున్నా
మా ఊరు మొత్తంలో దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. కానీ నీటి సౌకర్యం లేక 300 ఎకరాల కంటే ఎక్కువ రైతులు వ్యవసాయం సాగు చేయలేకపోయేది. కేసీఆర్ సీఎం అయ్యాక అయిన తరువాత మా ఊరి పక్కనుంచే 71 డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు వెళ్లటంతో భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లు, బావుల్లో నీళ్లు పుష్కలంగా వచ్చాయి. దీనికి తోడు మా ఊళ్లోని చెరువులు, కుంటలను కాళేశ్వరం జలాలతో నింపటంతో సాగుకు ఢోకా లేకుండాపోయింది. నీటి సౌకర్యం ఎక్కువగా ఉండటంతో ప్రతి సీజన్లో దాదాపు 1,200 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఇది కాళేశ్వరం జలాలు వచ్చాకే సాధ్యమైంది. నాకు కూడా నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది, కాళేశ్వరం జలా పుణ్యమా అని ఆ భూమి సాగు చేస్తున్నా.
– తొట్టె లింగయ్య, పర్సాయపల్లి, అర్వపల్లి మండలం, సూర్యాపేట జిల్లా