World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) అఖరి ఘట్టానికి చేరుకుంది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఫైనల్లో తలపడుతున్న భారత్, ఆస్ట్రేలియా అంతిమ సమరానికి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. సొంతగడ్డపై టీమిండియా రెండోసారి ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా అందుకోవాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నాయి. మరోవైపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరుకు బీసీసీఐ (BCCI)అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదండోయ్.. బిగ్ ఫైట్ సందర్భంగా ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్లను సన్మానించనుంది.
మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ముగిశాక వీళ్లందరికీ స్పెషల్ బ్లేజర్లు(Special Blazers) అందజేస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. టీమిండియాకు ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్(Kapil Dev), మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)లతో పాటు క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), అలన్ బోర్డర్(ఆస్ట్రేలియా), అర్జున రణతుంగ(శ్రీలంక), స్టీవ్ వా(ఆస్ట్రేలియా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), మైఖేల్ క్లార్క్(ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్)లు అహ్మదాబాద్ స్టేడియంలో సందడి చేయనున్నారు.
Special Blazer to be presented to all the World Cup winning captains – Lloyd, Kapil, Border, Ranatunga, Waugh, Ponting, Dhoni, Clarke, Morgan (except Imran Khan, who is in prison) on November 19th. [Sports Tak] pic.twitter.com/zyU3AbJy1q
— Johns. (@CricCrazyJohns) November 17, 2023
ప్రపంచకప్లో టాప్ గేరులో దూసుకెళ్తున్న భారత జట్టు.. వాంఖడేలో జరిగిన తొలి సెమీస్లో కివీస్నుచిత్తు చేసింది. సీనియర్ పేసర్ షమీ 7 వికెట్లతో చెలరేగగా.. 2019 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. రోహిత్ సేన నవంబర్ 19న టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
2003 వరల్డ్ కప్ ఫైనల్లో కంగారూల చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో ఆసీస్ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. ఫైనల్లోనూ చెలరేగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే ఆస్ట్రేలియా తర్వాత అత్యధికసార్లు చాంపియన్గా నిలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది.