అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అధికార వైసీపీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఉద్యోగ, ఉపాధి కల్పన గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించుకోవాలని సూచించారు. అల్లూరి జిల్లా పాడేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రసంగించారు. అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు ( Employment ) ఇస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కరికి ఉద్యోగం కల్పించలేదని ఆరోపించారు.
అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు వేయలేదని , పరిశ్రమలు స్థాపించక యువకులు నిరుదోగ్యులుగా మారుతున్నారని దుయ్యబట్టారు. పిల్లల భవిష్యత్ను ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిరిజనులకు 20 లక్షల ఎకరాలకు పోడుభూములు ఇచ్చారని తెలిపారు. ఏడు హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదాని (Adani )గ్రూప్లకు అప్పగించారని ఆరోపించారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టేది వీరా అంటూ జగన్ను ఉద్దేశించి అన్నారు.
మూడు రాజధానులు అన్నారు. తట్టెడు మట్టి పోయలేదు. పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీ వెనుకంజలో ఉందని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రత్యేక హోదాను తీసుకు వస్తే ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు వచ్చేవని ఆ దిశగా ఏనాడు ప్రయత్నించలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గంజాయి మయం చేశారని, ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని ఆరోపించారు.