– కార్పొరేషన్కు అప్పెందుకు
– 76 జీఓ పట్టాలు అడ్డుపడేదెవ్వరు
– కాంగ్రెస్, సిపిఐలో ఎవరు ప్రతిపక్షం, ఎవరు మిత్రపక్షం
– కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉన్నచోట ప్రపంచ బ్యాంకు నిధులకు ఆహ్వానమా
– ఎమ్మెల్యే సారు మాతో కలిసిరండి అభివృద్ధి చేసుకుందాం
– ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది
– విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ భీమ శ్రీవల్లి, స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 07 : కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు అప్పులు చేసి నిధులు తేవడం అవసరమా అని బీఆర్ఎస్ కార్పొరేటర్ బీమా శ్రీవల్లి, స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు బీమా శ్రీధర్ ప్రశ్నించారు. 60 డివిజన్లోని భీమ శ్రీధర్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.600 కోట్ల నిధులు అప్పులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. డిపిఆర్ పేరిట రూ.8 కోట్ల గోల్మాల్ అవడం వాస్తవం కాదా అని అన్నారు. కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఆదాయం లేని కార్పొరేషన్ కు రూ.600 కోట్లు అప్పులు అవసరమా అని, అప్పుల భారం ప్రతి సంవత్సరం రూ.39 కోట్ల వడ్డీని ఎలా తిరిగి చెల్లిస్తారన్నారు.
కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ కూడా సిపిఐ పార్టీ అయి ఉండి ప్రపంచ బ్యాంకు నిధులను స్వాగతించడం సిగ్గుచేటు అన్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రపంచ బ్యాంకు నిధులకు వ్యతిరేకంగా పోరాడిన సిపిఐ పార్టీ నేడు అదే నిధులు కోసం ఆరాటపడడం ఏమిటని ప్రశ్నించారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో మౌలిక సదుపాయాలకే దిక్కు లేదు కానీ అప్పుల పేరుతో డిజిటలైజేషన్ చేయడం ఎవరిని మభ్యపెట్టడానికి అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి సీపీ పార్టీ మిత్రపక్షమ ప్రతిపక్షం తేల్చాలని డిమాండ్ చేశారు. తాము కార్పొరేషన్ అభివృద్ధికి వ్యతిరేకం కాదని కార్పొరేషన్ అభివృద్ధి డిఎంఎఫ్, సి ఎస్ ఆర్ నిధులతో చేయటం సాధ్యం కాదా అని ప్రశ్నించారు.
రూ.600 కోట్ల అప్పుల విషయాన్ని రహస్యంగా ఉంచడం ఎవరి స్వలాభం కోసమని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి పని చేద్దామని ఆహ్వానించారు. తక్షణమే డిపిఆర్ ను రద్దు చేయాలని, డిపిఆర్ పేరిట జరిగిన రూ.8 కోట్ల గోల్మాల్పై విచారణ నిర్వహించాలని, కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని, బాధ్యులైన అధికారులను విధులను తొలగించాలని డిమాండ్ చేశారు.