– నాగార్జునసాగర్ ఆయకట్టు పరిరక్షణ సమితి వ్యవస్థాపక సభ్యుడు సప్పిడి శంబిరెడ్డి
గరిడేపల్లి, ఆగస్టు 07 : వర్షాభావ పరిస్థితులతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చాలని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిరక్షణ సమితి వ్యవస్థాపక సభ్యుడు సప్పిడి శంబిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, బోర్లు, బావులు ఎండిపోవడంతో రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి అక్కడి రైతులను ఆదుకోవడం స్వాగతించదగిన విషయమేనని, అయితే ఎడమ కాలువ పరిధిలోని తెలంగాణ రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం సమానంగా పరిగణించాలని అన్నారు. సాగర్ ఎడమ కాల్వ కింద లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా నీటి విడుదల లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నాట్లు ఆలస్యమయ్యాయని, మరికొన్ని చోట్ల నాటిన వరి నీటి కొరతతో ఎండిపోయే పరిస్థితి నెలకొందని. రైతులు అప్పులు చేసి వ్యవసాయం ప్రారంభించినా సాగునీరు అందక పెట్టుబడులు వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సాగర్ ఎడమ కాల్వ వెంటనే విడతల వారీగా నీటిని విడుదల చేసి మార్గమధ్యంలోని చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా కొంతవరకు పరిష్కారమవుతుందని సూచించారు. దీంతో పాటు పశువులకు నీరు అందడమే కాకుండా రైతులు పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రైతు సమస్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, ఎడమ కాలువ పరిధిలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రస్తుత దుస్థితిని దృష్టిలో ఉంచుకుని నాగార్జునసాగర్ నుంచి వెంటనే నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే రైతాంగంలో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.