Womens T20 Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ తహిలా మెక్గ్రాత్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ(613 పాయింట్లు) పదో స్థానం దక్కించుకుంది.
జెమీమా రోడ్రిగ్స్ (599 పాయింట్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (598పాయింట్లు) 12, 13 స్థానాల్లో ఉన్నారు. వికెట్ కీపర్ రీచా ఘోష్ కెరీర్ బెస్ట్ ర్యాంకు (20) అందుకుంది. వరల్డ్ కప్లో 19 ఏళ్ల రీచా అద్భుతంగా రాణిస్తోంది. ఐర్లాండ్తో మ్యాచ్ తప్ప మిగతా మూడు మ్యాచుల్లో 31, 44, 47 పరుగులతో నాటౌట్గా నిలిచింది.
ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ టాప్ 5లో నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (784 పాయింట్లు) టాప్ ప్లేస్లో ఉంది. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ (733 పాయింట్లు), రేణుకా సింగ్ (711 పాయింట్లు) వరుసగా నాలుగు, ఐదు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. టీమిండియా బౌలర్ స్నేహ్ రాణా 671 పాయింట్లతో 12వ స్థానం దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగింది. పొట్టి ప్రపంచ కప్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మహిళా క్రికెటర్గా గుర్తింపు సాధించింది.
టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ (392 పాయింట్లు) నాలుగో ర్యాంక్ దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన అష్లే గార్డ్నర్ 449 పాయింట్లతో నంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచింది. హయ్లే మాథ్యూస్ (వెస్టిండీస్) రెండు, అమేలియా కేర్ (న్యూజిలాండ్) మూడు ర్యాంకులో ఉన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్ చేరింది. చివరి గ్రూప్ మ్యాచ్లో ఐర్లాండ్పై ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో రాణించింది. పొట్టి ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు సెమీస్ చేరడం ఇది మూడోసారి.