Hockey | గతమెంతో ఘనం.. ప్రస్తుతమే దైవాధీనం అన్నట్లు ఉంది భారత హాకీ జట్టు పరిస్థితి. స్వాత్రంత్యం రాక ముందే నుంచి హాకీలో స్వర్ణయుగం కొనసాగించిన కాలక్రమేణ ఆ ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. దేశ హాకీకి వన్నెలు అద్దిన మేజర్ ధ్యాన్చంద్ నుంచి మొదలుపెడితే బల్బీర్సింగ్, ధనరాజ్ పిళ్లే, ముకేశ్కుమార్, సర్దార్సింగ్ లాంటి ఎంతోమంది మేలిమి ముత్యాలు వెలుగులు విరజిమ్మారు. ఒకానొక దశలో హాకీలో భారత్ ఎదురన్నదే లేకుండా పోయింది. ఫుట్బాల్లో బ్రెజిల్ ఆధిపత్యం ఎలా కొనసాగిందో.. హాకీలో మనల్ని కొట్టిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఒలింపిక్స్, ప్రపంచకప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్లో ఆసియా పవర్హౌజ్లుగా పేరొందిన భారత్, పాకిస్థాన్ జట్లదే పూర్తి ఆధిపత్యంగా కొనసాగింది. మైదానాల నుంచి ఎప్పుడైతే టర్ఫ్ వైపు మారిందో అప్పటి నుంచి హాకీలో ఆసియా దేశాలు వెనుకంజలో పడిపోయాయి.
అప్పటి వరకు సంప్రదాయ ఆటతీరుకు అలవాటు పడ్డ భారత ప్లేయర్లకు టర్ఫ్ గేమ్ను అందిపుచ్చుకునేందుకు సమయం పట్టింది. సరిగ్గా ఇదే సమయంలో యూరప్, ఆస్ట్రేలియా లాంటి జట్లు గేమ్ దశదిశను మార్చేశాయి. హాకీకి దూకుడును పరిచయం చేస్తూ యూరోప్ దేశాలు ఆటతీరును పూర్తిగా మార్చేశాయి. సుదీర్ఘ ఒలింపిక్ చరిత్రలో భారత హాకీది స్వర్ణయుగమని చెప్పాలి. 1928 నుంచి మొదలుపెడితే 1980 వరకు ఎనిమిది సార్లు మన జట్టు పసిడి వెలుగులు విరజిమ్మింది. ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తూ భారత్ సాగించిన స్వర్ణపతక జైత్రయాత్ర ప్రతీ హాకీ అభిమాని మదిలో ఇప్పటికీ చెదరని జ్ఞాపకం. ప్రపంచకప్ విషయానికొస్తే 1971లో మొదలైన మెగాటోర్నీ చరిత్రలో భారత్ 1975లో విజేతగా నిలిచింది. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచకప్ మనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ఏండ్లు గడుస్తున్నా..టోర్నీలు వస్తూ పోతున్నా చిరకాల కల కోసం కోట్లాది మంది భారతీయులు వేచిచూస్తున్న పరిస్థితి. అయితే వరుసగా రెండోసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్ ఈసారైనా సొంతగడ్డపై సత్తాచాటుతుందని అందరూ ఆశించారు. కానీ మన ప్లేయర్లు అందరిని నిరాశ పరుస్తూ కనీసం క్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమించారు. సొంత ఇలాఖాలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమ్ఇండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమైంది. తమ తొలిమ్యాచ్లో స్పెయిన్పై గెలిచిన భారత్..ఇంగ్లండ్తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆఖరి మ్యాచ్లో తమ కంటే తక్కువ ర్యాంక్లో ఉన్న వేల్స్పై కష్టపడి గెలిచింది. దీంతో నేరుగా క్వార్టర్స్ బెర్తు దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. హోరాహోరీగా సాగిన క్రాస్ ఓవర్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొంది. ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన ఈ మ్యాచ్లో భారత్ సడెన్డెత్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. హర్మన్ప్రీత్సింగ్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ అభిమానుల నుంచి అశేష మద్దతు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోయింది.
సరిగ్గా రెండేండ్ల క్రితం టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన భారత్…ప్రపంచకప్లోనూ అదే సీన్ రిపీట్ చేస్తుందని అందరూ భావించారు. దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగిన భారత్ అంచనాలు అందుకోలేకపోయింది. గాయం కారణంగా హార్దిక్ సింగ్ మెగాటోర్నీకి దూరం కావడం భారత అవకాశాలపై ప్రభావం చూపించింది. ప్రతీ మ్యాచ్లో లెక్కకు మిక్కిలి పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా..వాటిని గోల్స్గా మలువలేక మూల్యం చెల్లించుకుంది. హర్మన్ప్రీత్సింగ్, మన్ప్రీత్సింగ్, ఆకాశ్దీప్సింగ్, అమిత్ రోహిదాస్, నీలకంఠశర్మ, మన్దీప్సింగ్, గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ లాంటి మెరికల్లాంటి ప్లేయర్లు ఉన్నా..భారత్ సుదీర్ఘ కలను సాకారం చేయడంలో విఫలమయ్యారు. టోక్యో ఒలింపిక్స్ లాగే ప్రపంచకప్లో కొత్త చరిత్ర లిఖిస్తుందనుకున్న భారత్ టోర్నీ మధ్యలోనే పోరాటాన్ని ముగించింది.
దేశ హాకీని ఒక రకంగా దత్తత తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ..భారత్ ప్రపంచకప్ గెలిస్తే బంపర్ ఆఫర్ ప్రకటించారు. జట్టులో ఒక్కో ప్లేయర్కు కోటి చొప్పున నజరానా ఇస్తానని పేర్కొన్నారు. కానీ వారు ఆఫర్ను సరిగ్గా వాడుకోలేక క్వార్టర్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టారు. గురువారం జరిగే వర్గీకరణ మ్యాచ్లో భారత్…జపాన్తో తలపడుతుంది.
– నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
Shubman Gill | పరుగుల వరద పారిస్తున్న శుభ్మన్ గిల్.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం ఇతనే !!