WFI Controversy | కుస్తీ వీరులు ఓ పట్టు పట్టారు. ఏండ్లుగా తమపై సాగిస్తున్న లైంగిక, ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఉక్కుపిడికిలి బిగించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలతో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన రెజ్లర్లు పట్టు వదలని పోరాటం చేశారు. ఏండ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ వైఖరికి నిరసనగా రెజ్లర్లు ఢిల్లీ నడిబొడ్డున జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఓవైపు ఊదురుగాలులతో చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా..వెరవకుండా తమ పోరాటాన్ని కొనసాగించారు. రెజ్లింగ్ ప్రతిష్ఠను మంటగలుపుతున్న బ్రిజ్భూషణ్ను తప్పించేవరకు ఎత్తిన పిడికిలిని దించకుండా పోరాటం సలిపారు. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్పునియా, రవి దహియా లాంటి స్టార్ రెజ్లర్లు నిరసన దిగడం ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. టోక్యో ఒలింపిక్స్ ముగిసిన నాటి నుంచి శరణ్సింగ్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు వినేశ్ ఫోగట్ కన్నీరుమున్నీరు కావడం పరిస్థితి తీరుకు అద్దం పట్టింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చలిలో రెజర్ల న్యాయమైన పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదు. అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ను వెంటనే పదవి నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర క్రీడాశాఖ విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు దిగ్గజ అథ్లెట్ సారథ్యంలోని భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) వెంటనే స్పందిస్తూ ఏడుగురు సభ్యులతో కమిటీ నియమించింది. మొత్తంగా రెజ్లర్ల పోరాటం మరో షాహిన్బాగ్ గుర్తుకు తెచ్చింది.
నిప్పు లేనిదే పొగ రాదు అన్నది జగమెరిగిన నానుడి. అవును ఇన్ని రోజులుగా ఓపిక వహించిన మల్లయోధులు నడుం బిగించారు. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఇన్నేండ్లు అఖాడాలకే పరిమితమమైన రెజ్లర్లు తమపై జరుగుతున్న దాడులను సమర్థంగా తిప్పికొట్టారు. పోరాటాన్నే ఆయుధంగా మలుచుకుంటూ ఏ రాజకీయ పార్టీల అండదండ లేకుండా తమ న్యాయమైన పోరాటంతో అందరి ముందుకొచ్చారు. ఉగ్గుపాలతోనే కుస్తీ పట్లు నేర్చుకుని ప్రత్యర్థులను మట్టికరిపించడంలో ఆరితేరిన మన మల్లయోధులు ఇంటి దొంగల పనిపట్టారు. పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న రీతిలో రెజ్లర్లు పోరాడిన తీరు దేశ ప్రజల మనసు దోచుకుంది. మూడు రోజుల అలుపెరగని పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అర్ధరాత్రి సమయంలో రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సమస్యల పరిష్కారానికి సమ్మతించాడు. తమ డిమాండ్లకు క్రీడాశాఖ ఒప్పుకోవడంతో రెజ్లర్లు తమ పోరాటానికి ముగింపు పలికారు. ఈ క్రమంలో రెజ్లర్లకు ఓవైపు మెండైన మద్దతు లభించగా, మరోవైపు ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారంటూ లేనిపోని ఆరోపణలు చేశారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న ప్రగాఢ నమ్మకంతో ముందుకెళ్లిన రెజ్లర్ల చర్యలతో కేంద్ర క్రీడాశాఖ, ఐవోఏ దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది. తొలుత ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష..ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీ వేయగా, ఆ తర్వాత మంత్రి అనురాగ్ ఠాకూర్..దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సారథ్యంలో మరో కమిటీ వేసింది. మొత్తంగా రెండు కమిటీలు డబ్ల్యూఎఫ్ఐలో ఇన్నాళ్లు జరిగిన అరాచకంపై విచారించి నివేదిక సమర్పించనున్నాయి. ఇదిలా ఉంటే అధ్యక్షుడు బ్రిజ్భూషణ్తో పాటు కార్యదర్శి వినోద్ తోమర్పై వేటు వేసిన క్రీడాశాఖ పార్టీపరంగా కూడా బీజేపీ చర్యలకు దిగింది. ఎక్కడా మెదలకుండా అన్ని వైపులా నుంచి ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైంది.
మహిళా రెజ్లర్లను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధిస్తున్నారని ప్రముఖ రెజ్లర్లు బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు క్రీడాకారులు ఆందోళన చేపట్టడం దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఇదే విషయమై ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు కూడా మహిళా రెజ్లర్లు లేఖ రాశారు. ఒలింపిక్స్ మెడల్ రాకపోవడంతో వినేశ్ ఫొగట్ను బ్రిజ్ భూషణ్ వేధించారని పేర్కొన్నారు. ఆమెతో పాటు యువ మహిళా రెజ్లర్లను కూడా లైంగిక వేధింపులకు గురి చేశారని లేఖ రాశారు. రెజ్లర్లు చేపట్టిన ఆందోళన దుమారం రేపడంతో క్రీడల శాఖ రంగంలోకి దిగింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అంటే బ్రిజ్భూషణ్ అన్నట్లు మారిపోయింది. తాను ఆడిందే ఆట పాడిందే పాట. ఎదురుచెప్పే వాళ్లే ఎవరు లేరు. 2011 నుంచి మొదలుపెడితే పుష్కర కాలం పాటు బ్రిజ్భూషణ్దే హవా. 1957లో ఉత్తరప్రదేశ్లోని గోండాలో పుట్టిన బ్రిజ్భూషణ్ విద్యార్థి నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగాడు. అప్పటి బీజేపీ దిగ్గజ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలో బ్రిజ్భూషణ్ కూడా పాలుపంచుకున్నాడు. అయితే సుదీర్ఘ విచారణ తర్వాత ఇటీవలే ఈ వివాదస్పద కేసు నుంచి బయటపడ్డాడు. ఒక రకంగా గొండా ప్రాంతంలో తనకంటూ సమాజ్య్రాన్ని ఏర్పరుచుకున్న బ్రిజ్భూషణ్.. ఇన్నేండ్లు రెజ్లింగ్ సమాఖ్యను ఒంటిచేత్తో ఏలాడు. ఓవైపు రెజ్లర్లు న్యాయమైన పోరాటం చేస్తుంటే..ఇతను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అగ్గిరాజేసే ప్రయత్నం చేశాడు. విపక్ష పార్టీల సహకారంతో రెజ్లర్లు రెజ్లింగ్ సమాఖ్య పరువు తీస్తున్నారంటూ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. అయితే రెజ్లర్ల స్ఫూర్తిదాయక పోరాటంతో వాటిని తిప్పికొట్టారు. ఒకానొక దశలో రెజ్లర్ల పోరాటాన్ని షహీన్బాగ్ నిరసనతో పోల్చుతూ బ్రిజ్భూషణ్ రాక్షస ఆనందాన్ని పొందాడు. వార్తల్లో నిలిచేందుకు రెజ్లర్లు అనవసరంగా ధర్నాకు దిగిరాంటూ నోరు జారాడు. తాను నోరు విప్పితే సునామీ వస్తుదంటూ ఒకానొక దశలో పార్టీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే కేంద్ర నాయకత్వం మద్దతు లేకపోవడంతో బ్రిజ్భూషణ్ మెట్టు దిగని పరిస్థితి నెలకొంది. మొత్తంగా రెజ్లింగ్ సమాఖ్యలో బ్రిజ్భూషణ్ రాక్షసత్వానికి ముగింపు కార్డు పడ్డట్లే. రెండు కమిటీలు న్యాయ అన్యాయాలను పరిశీలించి బ్రిజ్భూషణ్ పాత్రపై ఎలాంటి నివేదిక సమర్పిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
– నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
IND vs NZ | మూడో వన్డేలో కివీస్ను చిత్తు చేసిన భారత్.. 3-0తో సిరీస్ కైవసం