అయోధ్య: అయోధ్య రామాలయానికి(Ayodhya Ram Temple) సీఈవోను ఎంపిక చేసే ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. కొత్తగా నిర్మించిన రామాలయంలో ఇవాళ సీఈవో పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మొత్తం 18 మందిని ఇంటర్వ్యూల కోసం షార్ట్లిస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సీఈవోగా ఎవరి ఎంపిక అవుతారన్న అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. రామాలయంలో నిధులను చోరీ చేసిన ఘటన నేపథ్యంలో పూర్తి స్థాయి సీఈవోను నియమించాలని ట్రస్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సుమారు 5200 దరఖాస్తులను పరిశీలించి, దాంట్లో నుంచి 18 మందిని ఇంటర్వ్యూ కోసం షార్ట్లిస్టు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభమైంది.
రామాలయంలోని పర్యాటకుల వసతి కేంద్రంలో ఉన్న కాన్ఫరెన్స్ రూమ్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. షార్ట్లిస్టు అయిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కాన్ఫరెన్స్ రూమ్కు చేరుకున్నారు. అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రతి అభ్యర్థిని సంబంధిత హోటల్స్కు తరలించారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు ఎవరూ మీడియాతో మాట్లాడవద్దు అని ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్వ్యూలు పూర్తి అయిన తర్వాత అయోధ్య విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ నుంచి తమ స్వంత ప్రదేశాలకు విమానాల్లో అభ్యర్థులు వెళ్లనున్నట్లు ట్రస్టు అధికారులు చెప్పారు.
ఇంటర్వ్యూలు నిర్వహించిన త్రిసభ కమిటీ సోమవారం రాత్రి అయోధ్య చేరుకున్నది. అయితే 18 మంది అభ్యర్థుల నుంచి ఇంటర్వ్యూ ద్వారా చివరకు ముగ్గురు వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఇక ఆ ముగ్గరిలో ఎవరు సీఈవో అన్న విషయాన్ని ట్రస్టు ప్రకటించనున్నది. ఇంటర్వ్యూ ప్యానల్లో సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేశ్ హవారే ఉన్నారు. ఒకవేళ మంగళవారం ఇంటర్వూలు పూర్తి కాకుంటే, బుధవారం కూడా ఆ ప్రక్రియ కొనసాగించనున్నారు.