Team India : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు(Team India) .. సొంత గడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్(T20 Series)లో ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోంది. మూడు మ్యాచుల్లో ఆసీస్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన 3-1తో సిరీస్ సొంతం చేసుకుంది. శుక్రవారం రాయ్చూర్లో జరిగిన నాలుగో టీ20లో కంగారూలపై 20 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. పొట్టి ఫార్మాట్లో 136వ విజయం ఖాతాలో వేసుకుంది. తద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
రెండో టీ20లో ఆసీస్ను చిత్తు చేసిన భారత్ 135వ విజయంతో దాయాది పాకిస్థాన్ రికార్డు సమం చేసింది. రాయ్చూర్ మ్యాచ్లో గెలుపొందడంతో ఇప్పుడు టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. 2006 నుంచి ఇప్పటివరకూ 213 టీ20ల ఆడిన టీమిండియా 136 మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక పాకిస్థాన్ 226 మ్యాచుల్లో 135 సార్లు గెలుపొందింది. న్యూజిలాండ్ జట్టు 200 మ్యాచుల్లో 102 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా 95, ఆస్ట్రేలియా 94 విజయాలతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
India moves to the 🔝#INDvAUS pic.twitter.com/uhXMJMFN7p
— ICC (@ICC) December 2, 2023
ఐసీసీ 2007లో తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలిచింది. ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని యువ భారత్ ఫైనల్లో పాకిస్థాన్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. అక్కడితో మొదలు.. పొట్టి ఫార్మాట్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. సొంతగడ్డపై ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టుకు ఎదురన్నదే లేకుండా పోయింది.
వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరుగనున్న టీ20 వరల్డ్ కప్పై కన్నేసిన భారత జట్టు యువకులను సానబెడుతోంది. యువకెరటాలు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ బ్యాటుతో బాదేస్తుంటే.. రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ బంతితో రాణిస్తున్నారు. దాంతో, ఈసారి పొట్టి ప్రపంచ కప్లో భారత్ ఫేవరేట్గా బరిలోకి దిగనుంది.