WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024) రెండో సీజన్ మినీ వేలానికి మరో వారమే ఉంది. దాంతో, ఐదు ఫ్రాంచైజీలు ప్లేయర్ల ఎంపికపై భారీ కసరత్తు చేస్తున్నాయి. ముంబైలో డిసెంబర్ 9న జరిగే ఈ వేలంలో 165 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. అయితే.. 30 మందికి మాత్రమే చాన్స్ ఉంది. ఈసారి అత్యధిక ధర ఎంతో తెలుసా..? రూ.50 లక్షలు.
వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డియాండ్ర డాటిన్(Deandra Dottin), ఆస్ట్రేలియాకు చెందిన కిమ్ గార్త్(Kim Garth) రూ.50 లక్షల కనీస ధరకు తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. నిరుడు వేలంలో గుజరాత్ జెయింట్స్ డాటిన్ను కొనుగోలు చేసింది. అయితే.. ఫిట్నెస్ సర్టిఫికేట్ విషయమై ఫ్రాంచైజీతో వివాదం కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది.
ఇక రెండో అత్యధిక కనీస ధర అయిన రూ.40 లక్షల కేటగిరీలో నలుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్లు అనాబెల్ సథర్లాండ్, జార్జియా వరేహం, దక్షిణాఫ్రికా పేస్ సంచనలం షబ్నిం ఇస్మాయిల్(Shabnim Ismal), ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ 40 లక్షల విభాగంలో వేలానికి వస్తున్నారు. ఇక రూ.30 లక్షల కనీస ధరలో చమరి ఆటపట్టు(శ్రీలంక), వేద కృష్ణమూర్తి(భారత్), ఇంగ్లండ్ ఓపెనర్ డాని వ్యాట్, ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబే లిచ్ఫీల్డ్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు రిజష్టర్ అయ్యారు.
తొలి సీజన్ ట్రోఫీతో హర్మన్ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్)
రెండో సీజన్ వేలంలో 56 మంది క్యాప్డ్, 109 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి గుజరాత్ జెయింట్స్ వేలంలో అత్యధికంగా రూ.5.95 కోట్లు ఖర్చు చేయనుంది. యూపీ వారియర్స్ రూ. 4 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.3.35 కోట్లు వెచ్చించనున్నాయి. నిరుడు బీసీసీఐ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో మేగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిట్స్పై ముంబై ఘన విజయం సాధించింది.