ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆటగాళ్లు, కోచింగ్ సహాయ సిబ్బంది అందరూ మే 19న ముంబైలో సమావేశంకానున్నారు. వీరంతా ఒక్కదగ్గర చేరడానికి ముందే ఆటగాళ్లందరూ మూడు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకునే ఏర్పాట్లను బీసీసీఐ చేసినట్లు రోడ్మ్యాప్ గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి.
‘ఆటగాళ్లు వారి ఇళ్ల వద్ద మూడు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకుంటారు. నెగెటివ్ వచ్చిన తర్వాత మే 19న ముంబైలో ఒక్కదగ్గరికి చేరుతారు. జూన్ 2న ఇంగ్లాండ్కు బయల్దేరే ముందు ప్రతి ఒక్కరూ భారత్లోనే 14 రోజుల క్వారంటైన్లో ఉంటారని’ ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్ చేరిన అనంతరం టీమ్ఇండియా క్వారంటైన్లో ఉండడానికి సంబంధించి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.
మూడు నెలలకు పైగా సాగే పర్యటన కోసం బయల్దేరే క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. డబ్ల్యూటీసీ టోర్నీ, ఇంగ్లాండ్తో ఐదు టెస్టులకు 20 మందితో బోర్డు జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18న ఆరంభమవుతుంది. బీసీసీఐ సూచన మేరకు ఇంగ్లీష్ టూరుకు ఎంపికైన ఆటగాళ్లందరూ కొవిడ్ వ్యాక్సీన్ తొలి డోసు తీసుకుంటున్నారు.