న్యూఢిల్లీ, జూన్ 1: దేశీయ ఆటో రంగానికి ఈ ఏడాదీ కరోనా సెగ తగులుతున్నది. లాక్డౌన్లతో వ్యాపారాలు సాగక, అమ్మకాలే కరువవుతున్నాయి. గత నెల మేలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోట వంటి ప్రధాన సంస్థల వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పడిపోయాయి. ప్యాసింజర్ కార్ల అమ్మకాలేగాక, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల విక్రయాలూ క్షీణించినట్లు మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో తేలింది. గతేడాది కూడా ఏప్రిల్, మే నెలల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఆటో విక్రయాలు పూర్తిగా ఆగిన విషయం తెలిసిందే. కాగా, ఆదాయాలు తలకిందులు కావడంతోనూ చాలామంది తమ వాహన కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఆక్సిజన్ లేక ఆగిన ఉత్పత్తి
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను తీర్చడానికి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ను మళ్లించడంతో ఆటో సంస్థల వాహన ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. మారుతి సుజుకీ మే 1-16 మధ్య కార్ల తయారీని నిలిపివేసింది. ఇలా చాలా సంస్థలు తమ ఉత్పత్తికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. మరోవైపు ఉద్యోగులు కరోనా బారిన పడుతుండటంతోనూ పలు సంస్థలు ఉత్పత్తిని ఆపేశాయి.
బజాజ్ సేల్స్ డబుల్
బజాజ్ ఆటో అమ్మకాలు మే నెలలో రెట్టింపు కావడం గమనార్హం. ఇతర పోటీ సంస్థలకు భిన్నంగా గతేడాది మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో 114 శాతం వృద్ధిని నమోదు చేసింది. నిరుడు మేలో 1,27,128 వాహనాలను అమ్మినట్లు చెప్పిన బజాజ్.. ఈ మేలో 2,71,862 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. దేశీయ అమ్మకాల్లో 52 శాతం వృద్ధిని చూశామని పేర్కొన్నది. త్రిచక్ర వాహన విక్రయాలూ 118 శాతం పుంజుకున్నాయి.
సంస్థ 2021 ఏప్రిల్ 2021 మే క్షీణత
మారుతి సుజుకీ 1,59,691 46,555 71%
హ్యుందాయ్ 59,203 30,703 48%
టాటా మోటర్స్ 39,530 24,552 38%
మహీంద్రా 36,437 17,447 52%
కియా 16,111 11,050 31%
టయోటా 9,622 707 –
హోండా 9,072 2,032 78%
ఎంజీ మోటర్ 710 (2020 మే) 1,016 –
అశోక్ లేలాండ్ 8,340 3,199 62%
వీఈ కమర్షియల్ 2,145 1,223 43%
హీరో మోటోకార్ప్ 3,72,285 1,89,044 51%
టీవీఎస్ మోటర్ 2,38,983 1,66,889 30%
రాయల్ ఎన్ఫీల్డ్ 53,298 27,294 49%
హోండా 54,000 (2020 మే) 38,763 28%
యమహా ఎఫ్జెడ్ బైకులు చౌక
తమ ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్జెడ్ 25 బైక్ల ఎక్స్షోరూమ్ ధరల్ని తగ్గిస్తున్నట్లు ద్విచక్రవాహన కంపెనీ యమహా మోటార్ ఇండియా మంగళవారం తెలిపింది. ఈ రెండు మోడల్స్ ధరలు రూ.19,300, రూ.18,800 మేర తగ్గుతాయి. తగ్గింపు అనంతరం ఎఫ్జడ్ఎస్ 25 ధర రూ.1,39,300, ఎఫ్జెడ్ 25 ధర రూ.1,34,800 (ఎక్స్షోరూమ్ ఢిల్లీ). ఎఫ్జడ్ సిరీస్ వాహనాలకు కొద్దికాలం క్రితం ముడి వ్యయాలు బాగా పెరగడంతో తమ ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సివచ్చిందని, ఆ వ్యయాలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.