ఐపీఎల్లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి బంతి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్దే పైచేయి అయ్యింది. సొంత ఇలాఖాలో సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ గుజరాత్పై ఢిల్లీ డబుల్ ధమాకా మోగించింది. కెప్టెన్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్ అర్ధసెంచరీలతో ఢిల్లీ భారీ స్కోరు అందుకుంది. గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఒకానొక దశలో స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందనుకున్న క్యాపిటల్స్..పంత్, పటేల్ బ్యాటింగ్తో పోరాడే స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో సుదర్శన్ అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిల్లర్ కిల్లర్ షాట్లతో ఢిల్లీ గుండెల్లో గుబులు పుట్టించాడు. ఆఖర్లో రషీద్ఖాన్ కడదాకా పోరాటం చేసినా..గుజరాత్ గెలుపు తీరాలుకు చేరలేకపోగా..హమ్మయ్య గెలిచామంటూ ఢిల్లీ ఊపిరిపీల్చుకుంది.
IPL | ఢిల్లీ: వారం రోజుల క్రితం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ను వందలోపే పరిమితం చేసి చిత్తుగా ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్.. బుధవారం 224 పరుగులు చేసినా విజయం కోసం ఆఖరి బంతిదాకా వేచి చూడాల్సి వచ్చింది. గుజరాత్తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.తొలుత ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరుచేసింది. రిషభ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కూడా తక్కువ తిన్లేదు. మిల్లర్ (23 బంతుల్లో 55, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని భయపెట్టగా సుదర్శన్ (39 బంతుల్లో 65, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (21 నాటౌట్) రాణించారు. పంత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఢిల్లీ ఇన్నింగ్స్కు జేక్ ఫ్రేజర్ (23) మెరుపు ఆరంభాన్నిచ్చినా అతడు ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఒకే ఓవర్లో ఢిల్లీ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. నాలుగో స్థానంలో వచ్చిన హోప్ (5) సైతం నిరాశపరిచాడు. 9 ఓవర్లకు ఢిల్లీ చేసిన స్కోరు 68 పరుగులే. కానీ అసలు కథంతా ఆ తర్వాతే మొదలైంది. అప్పటికే క్రీజులో కుదురుకున్న అక్షర్ పటేల్.. పంత్ అండతో గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అప్పటిదాకా ఓవర్కు ఒక ఫోర్ కొట్టేందుకు తంటాలు పడ్డ ఢిల్లీ.. ఆ తర్వాత బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటంతో 9 ఓవర్ నుంచి 16 ఓవర్ మధ్యలో ఆ జట్టు 75 పరుగులు రాబట్టింది. అర్ధ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడబోయిన అక్షర్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్కు ఈ జోడీ 68 బంతుల్లోనే 113 పరుగులు జోడించింది. కానీ అప్పటికే జోరందుకున్న పంత్.. క్రీజులోకి వచ్చీరాగానే స్టబ్స్ (7 బంతుల్లో 26, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) గుజరాత్ బౌలర్లను ఉతికారేశారు. సాయికిషోర్ 19వ ఓవర్లో 4,6,4,6తో స్టబ్స్ 22 పరుగులు రాబడితే మోహిత్ ఆఖరి ఓవర్లో పంత్.. నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీతో 31 పరుగులు పిండుకున్నాడు.
225 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్.. ఆరంభంలోనే సారథి గిల్ (6) వికెట్ను కోల్పోయినా మరో ఓపెనర్ సాహా ( 39), సుదర్శన్ టైటాన్స్ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 49 బంతుల్లోనే 82 పరుగులు జోడించి పవర్ ప్లేలో వీరవిహారం చేశారు. కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. అర్ధ సెంచరీ పూర్తయ్యాక సాయి.. రసిక్ సలామ్ బౌలింగ్లో అక్షర్కు క్యాచ్ ఇచ్చాడు. షారుఖ్ఖాన్(8), తెవాటియా (4), అజ్మతుల్లా(1)సైతం విఫలమయ్యారు. కానీ డేవిడ్ మిల్లర్ ఢిల్లీని భయపెట్టాడు. నోకియా వేసిన 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీతో 24 పరుగులు రాబట్టి గుజరాత్ను పోటీలోకి తెచ్చాడు. అయితే ముకేశ్ 18వ ఓవర్లో మిల్లర్ను ఔట్ చేశాడు. 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో చెలరేగిన సాయికిషోర్ (13)ను రసిక్ ఆఖరి బంతికి బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. రషీద్ పోరాడినా ముకేశ్ 14 పరుగులే ఇచ్చి ఢిల్లీకి ఉత్కంఠ విజయాన్ని అందించాడు.
ఢిల్లీ : 20 ఓవర్లలో 224/4 (పంత్ 88 నాటౌట్, అక్షర్ 66, వారియర్ 3/15, అహ్మద్ 1/36)
గుజరాత్: 20 ఓవర్లలో 220/8 (సాయి 65, మిల్లర్ 55, రసిక్ 3/44, కుల్దీప్ 2/29