హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 ( నమస్తే తెలంగాణ ): రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రచించిన ‘జస్ట్ ఏ మెర్సనరీ? నోట్స్ ఫ్రం మై లైఫ్ అండ్ కెరీర్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దువ్వూరి మాట్లాడుతూ.. జిల్లాస్థాయి నియామకాలనుంచి దేశ బ్యూరోక్రాటిక్ ఫ్రేమ్వర్క్ వరకు జరిగిన పరిణామక్రమం, పౌరసేవల్లో లింగ సమానత్వం వంటి పలు ఆసక్తికర అంశాలను సృజించినట్టు తెలిపారు. గత యాబై ఏండ్లలో భారత్లో ఎన్నో మార్పులు వచ్చాయని, ముఖ్యంగా అనేక రంగాల్లో దేశం ముందుకు ప్రయాణించిందన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తోడవడంతో అధికారులు నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి వీలు పడిందన్నారు.
బ్యూరోక్రాట్స్ కేవలం వీడియో కాలింగ్స్, సమావేశాలతోనే విషయ పరిజ్ఞానం రాదని, చాలా విషయాలను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అన్ని సవ్యంగా ఉంటేనే అధికారులు చక్కటి నిర్ణయాలు తీసుకోగలరన్నారు. తన తల్లికి రాసిన లేఖను పుస్తకంలో అచ్చు వేశారని అన్నారు. ఆ లేఖను డాక్టర్ దువ్వూరి సుబ్బారావు స్వయంగా చదివి వినిపించడం అక్కడున్న వారిని కదిలించింది. ఈ కార్యక్రమంలో కౌటిల్యలోని విజిటింగ్ ఫ్యాకల్టీ స్మితా శర్మ, ప్రోగ్రామ్ మేనేజర్ శివాంగి శర్మ, కౌటిల్యా స్కూల్ పబ్లిక్ పాలసీ డీన్ సయ్యద్ అక్బరుద్దిన్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. 2005-07 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కార్యదర్శిగా పనిచేసిన దువ్వూరి.. 2008 నుంచి 2013 వరకు ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వహించారు.