Sunil Gavaskar : భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) ఫైనల్లో అడుగుపెట్టింది. దాంతో, తుది జట్టు కూర్పు గురించి మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్కు కొన్ని సూచనలు చేశాడు. వికెట్కీపర్గా కేఎస్ భరత్ (KS Bharat) బదులు యంగ్స్టర్ ఇషాన్ కిషన్(Ishan Kishan), లేదా కేఎల్ రాహుల్ (KL Rahul)ను తీసుకోవాలని ఈ లెజెండ్ అన్నాడు. ‘భరత్ వికెట్ కీపింగ్ అంత గొప్పగా లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్కీపర్గా అతడి బదులు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకోవాలి.
ఎందుకంటే.. వీళ్లిద్దరూ భరత్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేయగలరు’ అని ఈ మాజీ కెప్టెన్ తెలిపాడు. అతను ఇషాన్, రాహుల్వైపు మొగ్గు చూపడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..? ‘రాహుల్ గత ఏడాది ఇంగ్లండ్ లార్డ్స్ స్టేడియంలో సెంచరీ కొట్టాడు. అతడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐదు లేదా ఆరో స్థానంలో ఆడితే భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుంది. అంతేకాదు ఇంగ్లండ్లో పిచ్లు కీపర్ స్టంప్స్ దగ్గర ఉండి కీపింగ్ చేసేలా ఉండవు’ అని గవాస్కర్ వెల్లడించాడు.
రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడడంతో ఆసీస్తో టెస్టు సిరీస్కు భరత్, ఇషాన్ కిషన్లను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే.. ఇషాన్కు ఒక్క మ్యాచ్లోనూ అవకావం రాలేదు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన భరత్ మూడో టెస్టులో పుజారాతో కలిసి ధాటిగా ఆడాడు. ఆఖరి టెస్టులో విరాట్ కోహ్లీతో కలిసి ఐదో వికెట్కు 84 పరుగులు చేశాడు. 42 పరుగుల వద్ద లియాన్ ఓవర్లో వికెట్ సమర్పించుకున్నాడు. అయితే.. కీపింగ్లో మాత్రం ఈ తెలుగు క్రికెటర్ ఆకట్టుకున్నాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని 2-1తో గెలిచిన భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరింది. మూడో టెస్టులో నెగ్గిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుజట్లు ఈ ఏడాది జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం ఈ మెగా మ్యాచ్కు వేదిక కానుంది. 2021లో ఫైనల్ చేరిన టీమిండియా అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో, భారత జట్టు ఈసారి ఎలాగైనా టెస్టు గదను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.