Indore Pitch | ఇండోర్ టెస్ట్ పేలవమైన పిచ్ రేటింగ్పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు బీసీసీఐ (BCCI) అప్పీల్ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఇండర్ హోల్కర్ స్టేడియానికి చెందిన అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఐసీసీకి చెందిన ఇద్దరు సభ్యుల ప్యానెల్ ఈ విషయంపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నది. 14 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది.
ఈ మ్యాచ్లో ఒకే రోజు బౌలర్లు దాదాపు 30 వికెట్లు కూల్చారు. బౌలర్లు మొత్తం 31 వికెట్లు కూల్చగా.. 26 వికెట్లను స్పిన్ బౌలర్లే తీశారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పిచ్ పేలవంగా ఉందంటూ మొదటి రోజు నుంచే విమర్శలు వచ్చాయి. మ్యాచ్ రిఫరీ బ్రాడ్ తన నివేదికలో ‘పిచ్ చాలా పొడిగా ఉంది. తొలి నుంచి స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. పిచ్ మ్యాచ్ మొత్తం అధిక, అసమాన బౌన్స్ ఉంది’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐసీసీ పేలవమైన పిచ్ అంటూ మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది.
ఏదైనా వేదిక ఐదేళ్ల రోలింగ్ వ్యవధిలో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ డీ మెరిట్ పాయింట్లను పొందినట్లయితే 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్లను నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి పిచ్ రేటింగ్లు ఇచ్చేందుకు మ్యాచ్ రిఫరీలకు ఆరు స్కేల్స్ ఉంటాయి. ఇందులో వెరీగుడ్, గుడ్, యావరేజ్, బిలో యావరేజ్, పూర్ అండ్ అన్ఫిట్ ఉండగా.. సగటు కంటే తక్కువ రేటింగ్ ఉన్న పేలవమైన అర్హత లేని పిచ్లకు మాత్రమే డీమెరిట్ పాయింట్ల ఇస్తారు.
వాస్తవానికి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉంది. శీతాకాలం నేపథ్యంలో స్టేడియం మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు అనువుగా లేదంటూ ఇండోర్కు మార్చింది. అయితే, పిచ్ రేటింగ్కు వ్యతిరేకంగా బోర్డులు అప్పీల్ చేయడం ఇదే తొలిసారేమీ కాదు. ఇంగ్లండ్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా రావల్పిండి పిచ్కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. దీనిపై పీసీబీ అప్పీల్ చేయగా.. ఐసీసీ విచారణ జరిపి డీమెరిట్ను తొలగించింది. ఇదే క్రమంలో బీసీసీఐ సైతం ఐసీసీకి అప్పీల్ చేసినట్లు సమాచారం.