Harbhajan Singh : పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరికాసేపట్లో మొదల్వనుంది అనగా.. భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ సీఎస్కే ప్రధాన బలం మాత్రమే కాదు ఆ జట్టుకు గుండెకాయ లాంటివాడు అని అన్నాడు. అంతేకాదు మహీ తన జట్టులోని ప్రతి ఆటగాడితో అద్భుతాలు చేయించగల సమర్ధుడని భజ్జీ తెలిపాడు.
‘ధోనీకి జట్టు సభ్యులపై పూర్తి అవగాహన ఉంటుంది. అతను ప్రతి ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టగల సమర్ధుడు. సొంతగడ్డపై సీఎస్కే ప్రధాన బలం ఏంటంటే..? ఆ టీమ్ ఫ్యాన్స్. వాళ్లు సీఎస్కే జట్టు స్ఫూర్తిని పెంచుతారు. మ్యాచ్ గెలిచినా, ఓడినా వాళ్ల సపోర్టు ఎప్పుడూ ఉంటుంది’ అని హర్భజన్ వెల్లడించాడు.
ఈ సీజన్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెన్నైకి కీలకం కానున్నాడని భజ్జీ అన్నాడు. ‘జడ్డూ.. సూపర్ ఫామ్లో ఉన్నాడని, ప్రపంచంలోను అతనికంటే ఉత్తమ ఆల్రౌండర్ మరొకరు లేరని తెలిపాడు. 16వ సీజన్లో సీఎస్కే ఎక్స్ ఫ్యాక్టర్ తనే’నని ఈ మాజీ స్పిన్నర్ వెల్లడించాడు. భజ్జీకి ధోనీ కెప్టెన్సీలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. 2018- 2020 సీజన్లలో సీఎస్కే తరఫున ఆడాడు.
పదిహేను సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్ను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. మార్చి 31న ఈ మెగా లీగ్ షురూ కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ను ధోనీ సేన ఢీ కొట్టనుంది. ఈ సీజన్లో ప్రతి జట్టు తమ సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్లు ఆడనుంది. అంతేకాదు ఇంప్యాక్ట్ ప్లేయర్ను తీసుకునే అవకాశం కూడా ఉంది. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. అతని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. 2010, 2011, 2018, 2021లో ఆ జట్టు ఛాంపియన్గా అవతరించింది. మహీ ఆడనున్న ఆఖరి ఐపీఎల్ సీజన్ బహుశా ఇదే కావొచ్చు. దాంతో, అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే భావిస్తోంది.