Shadab Khan : పాకిస్థాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan) పొట్టి ఫార్మాట్లో కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అఫ్గానిస్థాన్(Afghanistan)తో మూడు టీ20ల సిరీస్కు అతను సారథిగా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ అయిన అతనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కెప్టెన్సీ అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజాంకు విశ్రాంతినిచ్చింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, పేసర్లు హ్యారిస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రీదీలు కూడా ఈ సిరీస్లో ఆడడం లేదు.
వీళ్ల ప్లేస్లో నలుగురు కొత్త ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్లో అదరగొడుతున్న ఇహ్షానుల్లాహ్, సయీం అయూబ్, తయ్యబ్ తహీర్, జమాన్ ఖాన్ టీ20లో ఆరంగేట్రం చేయనున్నారు. ‘పాక్ జట్టు కెప్టెన్గా ఎంపికైన షాదాబ్కు అభినందనలు. రెండేళ్లుగా అతను వన్డేల్లో వైస్ కెప్టెన్గా ఉన్నాడు. బాబర్ గైర్హాజరీలో షాదాబ్ కెప్టెన్గా జట్టును సమర్ధంగా నడిపిస్తున్నాడు’ అని పీసీబీ అధ్యక్షడు నజం సేథీ వ్యాఖ్యానించాడు.
అఫ్గానిస్థాన్ టీమ్ పాకిస్థాన్ పర్యటనలో మూడు టీ20లు ఆడనుంది. మార్చి 25 నుంచి 29 వరకు షార్జా స్టేడియంలో మూడు మ్యాచ్లు జరగనున్నాయి. దాంతో, పీసీబీ పొట్టి సిరీస్కు జట్టును ప్రకటించింది. జట్టు సభ్యుల వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సిరీస్కు మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ను తాత్కాలిక ప్రధాన కోచ్, బ్యాటింగ్ కోచ్గా పీసీబీ నియమించింది. బ్యాటుతో, బంతితో రాణిస్తున్న షాదాబ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పాకిస్థాన్ తరఫున టీ20 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు సాధించాడు. మాజీ ఆల్రౌండర్ షాహీద్ ఆఫ్రీదీ రికార్డును అతను బద్ధలు కొట్టాడు.