Border – Gavaskar Trophy : భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు డ్రాగా ముగిసింది. అయినా కూడా 2-1తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. వరుసగా నాలుగోసారి ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందుకుంది. సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ సిరీస్లో ఇరుజట్ల ఆటగాళ్లు పలు రికార్డులు బ్రేక్ చేశారు. కొందరు ప్లేయర్లు వ్యక్తిగతంగా ముఖ్యమైన మైలురాళ్లకు చేరువయ్యారు. వాళ్లు ఎవరెవరంటే..?
1. విరాట్ కోహ్లీ – బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 28వ టెస్టు సెంచరీ కొట్టాడు. అంతర్జాతీయంగా 75వ శతకం నమోదు చేశాడు. గత ఏడాది టీ20, వన్డేల్లో వంద కొట్టిన అతను టెస్టుల్లో కనీసం ఫిఫ్టీ కూడా బాదలేకపోయాడు. ఆఖరి టెస్టులో మాత్రం అతను సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ ఫార్మాట్లో అతను శతకం బాది దాదాపు మూడేళ్లు అయింది. 2019 నవంబర్లో కోహ్లీ టెస్టుల్లో మూడంకెల స్కోర్ చేశాడు. అప్పటి నుంచి వరుసగా విఫలమవుతూ వచ్చాడు. 26వ టెస్టులో అతను సెంచరీ కొట్టడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు.
2. రవిచంద్రన్ అశ్విన్ – ఈ బౌలింగ్ ఆల్రౌండర్ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాడు. 25 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఈ సిరీస్లో అతను రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో అతను ఈ ఫీట్ సాధించడం 26వ సారి. అంతేకాదు సొంతగడ్డపై ఎక్కువ వికట్లు పడగొట్టి లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను దాటేశాడు. ఈ క్రమంలోనే వరల్డ్ నంబర్ 1 బౌలర్గా నిలిచాడు.
3. ఛటేశ్వర్ పూజారా – ఆసీస్పై రెండు వేల పరుగులు కొట్టిన నాలుగో భారత క్రికెటర్గా నిలిచాడు. అహ్మదాబాద్లో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో పూజారా 42 రన్స్కు ఔట్ అయ్యాడు. ఆసీస్పై ఈ ఫార్మాట్లో 2,000లకు పైగా పరుగులు చేసిన వాళ్లలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman), ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
4. నాథన్ లియాన్ – భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్గా లియాన్ చరిత్ర సృష్టించాడు. 41 ఏళ్ల రికార్డును అతను ఇప్పటివరకు 55 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్కు చెందిన డెకెర్ అండర్వుడ్ పేరిట ఉంది. భారత గడ్డపై 16 టెస్టులు ఆడిన డెరెక్ 54 వికెట్లు తీశాడు. అయితే.. లియాన్ 11 టెస్టుల్లోనే అతని రికార్డు బ్రేక్ చేయడం విశేషం.
5. రవీంద్ర జడేజా – వరల్డ్ నంబర్ ఆల్రౌండర్ ఈ సిరీస్లో అదరగొట్టాడు. గాయంతో 5 నెలలు ఆటకు దూరమైన అతను పునరాగమనంలో ఇరగదీశాడు. ఈ సిరీస్లో 22 వికెట్లు తీశాడు. అశ్విన్తో సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఢిల్లీ టెస్టులో జడ్డూ ఒకే ఇన్నింగ్స్లో ఐదుగురిని బౌల్డ్ చేశాడు. దాంతో, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును అతను బ్రేక్ చేశాడు.
6. శుభ్మన్ గిల్ – భీకర ఫామ్లో ఉన్న యంగ్ ఓపెనర్ ఆఖరి టెస్టులో శతకం బాది అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఒకే ఏడాది శతకాలు బాదిన పదో క్రికెటర్గా, నాలుగో భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కీలకమైన టెస్టులో గిల్ 128 రన్స్ చేశాడు.
7. ఉస్మాన్ ఖవాజా – ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అహ్మదాబాద్ టెస్టు ఆఖరి టెస్టులో పది గంటలు క్రీజులో నిలిచాడు. 422 బంతులు ఎదుర్కొన్నాడు. భారత్పై టెస్టుల్లో ఎక్కువ బంతులు ఆడిన ఆటగాడిగా ఖవాజా రికార్డు సృష్టించాడు. చివరకు టీ సెషన్ తర్వాత 180 పరుగుల వద్ద అక్షర్ పటేల్ ఓవర్లో ఔట్ అయ్యాడు.
8. కామెరూన్ గ్రీన్ – ఈ ఆసీస్ ఆల్రౌండర్ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో సెంచరీ(114)తో మెరిశాడు. ఈ ఫార్మాట్లో అతనికి దే తొలి శతకం కావడం విశేషం. గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన అతను మూడో టెస్టుకు జట్టుతో కలిశాడు. ఆఖరి టెస్టులో ఉస్మాన్ ఖవాజాతో కలిసి మూడో వికెట్కు విలువైన పరుగులు జోడించాడు.
భారత్లో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్, జడేజా రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. 1. రవిచంద్రన్ అశ్విన్ – 2013లో (29 వికెట్లు, 20 పరుగులు). 2. రవీంద్ర జడేజా – 2017లో 25 వికెట్లు, 127 పరుగులు) 3. రవిచంద్రన్ అశ్విన్ – 2023లో (25 వికెట్లు, 86 పరుగులు), రవీంద్ర జడేజా (22 వికెట్లు, 135 పరుగులు)
భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ ఆఖరి బంతికి శ్రీలంకపై గెలుపొందడంతో ఇండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇండోర్ టెస్టులో గెలిచిన ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఈ ఏడాది జూన్లో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది.