పదవులు పోయాక బురదజల్లడం ఆయనకే చెల్లింది
భవిష్యత్తునిచ్చిన సీఎంపై కత్తిదూయడం కుటిలనీతే
చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు
ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలోకి!
ఇక్కడి ప్రజలపై చూపెట్టేది కపటప్రేమే
హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా ధ్వజమెత్తిన నాయకులు
ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిక
కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టీకరణ
కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జమ్మికుంట:రాజకీయ జన్మనిచ్చిన టీఆర్ఎస్కు ఈటల ద్రోహం చేశారని, తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు మండిపడుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, ఇప్పుడేమో నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీరుపై ఘాటుగా స్పందించారు. బడుగు బలహీనవర్గాలపై నిజమైన ప్రేమ ఉంటే ఆ అసైన్డ్ భూములను తిరిగి పేదలకు పంచాలని సవాల్ విసిరారు. ఎంతో భవిష్యత్తునిచ్చిన సీఎంను విమర్శించే నైతికహక్కు ఆయనకు లేదని హితవు పలికారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా హుజూరాబాద్లో గులాబీ జెండానే ఎగురుతుందని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఎన్నికలు వస్తేనే హుజూరాబాద్ నియోజకవర్గం గుర్తుకొస్తుందని, ఆయనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలపై వల్లమాలిన ప్రేమ చూపెట్టడం అంతా కపట నాటకమని, ఆయన మాటలు, చేతలకు ఎంతో తేడా ఉంటుందని విమర్శించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని నాయకులను గ్రూపులుగా విడదీసి రాజకీయ పబ్బం గడిపాడని, ఏ ఒక్క నాయకుడిని తన కండ్ల ముందు ఎదగనివ్వకుండా అణగదొక్కాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ వల్లే కీలక పదవులు దక్కాయని, ఈటల మాత్రం ఇప్పుడవన్నీ మరిచి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దుర్బుద్ధితో అక్రమ సంపాదనకు అలవాటు పడి, చెప్పుడు మాటలు విని కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ఎంతో భవిష్యత్తునిచ్చిన సీఎంపై కత్తిదూయడం ఆయన కుటిల నీతికి నిదర్శనమన్నారు. బడుగు బలహీనవర్గాలపై నిజమైన ప్రేమ ఉంటే ఆ అసైన్డ్ భూములను తిరిగి పేదలకు పంచాలని హితవుపలికారు. దేవుడ్లి పేరు చెప్పి పబ్బం గడిపే బీజేపీ నాయకులు అదే దేవుడి భూములు కాజేసిన ఈటలను పార్టీలోకి ఎలా తీసుకుంటున్నారో? ప్రజలకు వివరించాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్పైగానీ, సీఎం కేసీఆర్పై గానీ విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటూ నీతిమాలిన మాటలు చెప్పడం బండికి, బీజేపీ నాయకులకు అలవాటైందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నదని, టీఆర్ఎస్ టికెట్ ఎవరికిచ్చినా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారని తెలిపారు. కన్నతల్లిలాంటి పార్టీపై, భవిష్యత్తు ప్రసాదించిన కేసీఆర్పై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణశాఖ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కల్లెపెల్లి రమాదేవి, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, ముక్క రమేశ్, మాజీ పట్టణ అధ్యక్షుడు పంజాల కుమారస్వామి, టీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు గందె సాయిచరణ్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ రియాజ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మొలుగు పూర్ణచందర్, సీనియర్ నాయకులు బత్తుల సమ్మయ్య, సంపంగి మైకెల్ రాజేందర్, సాయి, కొలిపాక అజయ్, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఆస్తులను కాపాడుకునేందుకే..
వర్ధన్నపేట ఎమ్మెల్యే, జమ్మికుంట మండల ఇన్చార్జి ఆరూరి రమేశ్
ఈటల రాజేందర్ కన్నతల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని, పదవులన్నీ అనుభవించాక దుర్బుద్దితో పార్టీని, నాయకుడు కేసీఆర్ను బద్నాం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే, జమ్మికుంట మండల ఇన్చార్జి ఆరూరి రమేశ్ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి, ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలోకి పోతున్నారని ఎద్దేవా చేశారు. జమ్మికుంట మండలం వావిలాలలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. ఉద్యమానికి ఊపిరిలూదిన హుజూరాబాద్ టీఆర్ఎస్ గడ్డ, కేసీఆర్ అడ్డా అని, ఎన్నికలు ఏవైనా, అభ్యర్థి ఎవరైనా గులాబీ జెండానే ఇక్కడ ఎగురుతుందని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారని చెప్పారు. పార్టీలోకి ఎందరో వస్తుంటారు పోతుంటారని, పార్టీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందన్నారు. ఒక్కరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీ లేదని, వేలాది మంది కార్యకర్తలను తయారు చేసే సత్తా టీఆర్ఎస్కు ఉందన్నారు. కార్యకర్తలను, అన్ని వర్గాలను కంటికి రెప్పలా కాపాడుకునే శక్తి పార్టీకి ఉందని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ నియోజకవర్గానికి రాకముందే ఇక్కడ పార్టీ గుర్తుపై నాలుగు జడ్పీటీసీ, నాలుగు ఎంపీపీ, 80 శాతం ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ బీ ఫాం ఇస్తే గెలిచారని, కారు గుర్తు గెలిపించిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చిందని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేని విధంగా కరోనా సంక్షోభంలోనూ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎం ఆశీస్సులతో, జిల్లా ఇన్చార్జి మంత్రి సహకారంతో జమ్మికుంట మండలానికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు. వావిలాలలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, ఎంపీపీ మమత, వైస్ ఎంపీపీ తిరుపతిరావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు లింగారావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మతి తప్పిన మాటలు
పదవిని కోల్పోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నాడని, తన వైపు పార్టీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులెవరూ రాక పోవడంతో దిగజారుడు విమర్శలు చేస్తున్నాడని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ధ్వజమెత్తారు. హుజూరాబాద్లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈటల విమర్శలపై ఘాటుగా స్పందించారు. అధినేత కేసీఆర్పై, కన్నతల్లి లాంటి పార్టీపై ఈటల విమర్శలు చేయడం విచారకరమన్నారు. ద్రోహులెవరో, ఉద్యమకారులెవరో ఈ నియోజకవర్గపు ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించిన ఘనత ఇక్కడి ప్రజలదని, ఆనాడు ఇక్కడ ఈటల రాజేందర్ లేడని, ఉద్యమకారులు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యమం పేరు చెప్పి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నాడని, బడుగుల నేతగా పేరు చెప్పుకుంటూ వారి భూములనే లాక్కున్న చరిత్ర ఈటలదని మండిపడ్డారు. ఈటల గొర్రె తోలు కప్పుకున్న తోడేలని, బీసీ ముసుగు కప్పుకున్న పచ్చి ఫ్యూడల్ అని ఘాటుగా విమర్శించారు. ఎందరు ఎన్ని చెప్పినా సీఎం కేసీఆర్ ఈటలను నమ్మి ప్రోత్సహించారని, ఆయన అక్రమబాగోతాలను సహించలేకే దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ముమ్మాటికీ ఈటల స్వయం కృతాపరాధమేనని, ఆయన చెప్పినట్టుగానే హుజూరాబాద్ ఉప ఎన్నికలు కురుక్షేత్రం అయితే ధర్మం పక్షాన ఉన్న టీఆర్ఎస్కు విజయం, ఈటలకు పరాభవం తప్పదు అని స్పష్టం చేశారు.