హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు మంగళవారం అట్టహాసంగా మొదలయ్యాయి. బోడుప్పల్ వేదికగా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు చెర్ల అంజనేయులు స్మారకార్థం నిర్వహిస్తున్న మహిళల, పురుషుల కబడ్డీ టోర్నీని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయా జిల్లాలకు చెందిన ప్లేయర్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, మంత్రులు గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను అలరించాయి. పోటీల ప్రారంభం సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చేందుకు క్యాబినెట్ సబ్కమిటీ ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో క్రీడలకు తగిన రీతిలో ప్రాధాన్యమిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్యాదవ్, నిర్వహక కమిటీ చైర్మన్ మంద సంజీవరెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మిరవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పోటీల ప్రారంభానికి సూచికగా మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి సరదాగా కొద్దిసేపు కబడ్డీ ఆడారు.
–ఇవీ కూడా చదవండి