హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బుట్టదాఖలేనని ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్రావు పేర్కొన్నారు. కమిషన్ రిపోర్టును ఒక ముగిసిన కథగా అభివర్ణించారు. పీసీ ఘోష్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి విచారణ, చర్యలు తీసుకోలేరని ఆయన వివరించారు. ఈ నివేదిక ఆధారంగానే సీబీఐ విచారణ వేశారని, సీబీఐ ఆ కమిషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టంచేశారు. ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషన్ రిపోర్టులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. కమిషన్ ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలని రిపోర్టు ఇచ్చినప్పుడు, వారి వాదనలు వినాలనేది ప్రాథమిక సూత్రం అని తెలిపారు. వ్యక్తులకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వారి నోటీసులో ఉంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సెక్షన్(8) కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ను పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పాటించలేదని తెలిపారు. కమిషన్ తన రిపోర్టులో ప్రొవిజినల్ సేఫ్ గార్డ్స్ అయిన సెక్షన్(8) ప్రకారం ఎవరి మీదైనా నిందలు మోపాలన్నా, వ్యతిరేకంగా రిపోర్టు రాయాలంటే వ్యక్తుల సమాధానం కోరుతున్నామని చెప్పాల్సి ఉంటుందని వివరించారు. రైట్ టు క్రాస్ ఎగ్జామినేషన్, రైట్ టు రిప్రజెంటేటివ్ కౌన్సిల్ ఉంటుందని నొక్కి చెప్పారు. ప్రొవిజనల్ సేఫ్ గార్డ్స్ ఫాలో కాకుండా కమిషన్ రిపోర్టు ఇచ్చిందని.. కమిషన్ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కమిషన్ విచారణలో తేలినవి చెల్లవు అని కోర్టు స్పష్టం చేసిందని, కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టంచేసిందని చెప్పారు.
ఆర్టికల్-21, సెక్షన్(8)లను ఉల్లంఘించారు..
పీసీ ఘోష్ కమిషన్ ప్రొసీజర్ ఫాలో కాలేదని తీర్పులో హైకోర్టు వెల్లడించిందని గండ్ర మోహన్రావు పేర్కొన్నారు. దీంతో కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిపై ఎలాంటి చర్యలు తీసుకోలేరని ఆయన వివరించారు. కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొనగా.. ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఉన్నదని హైకోర్టు తన తీర్పులో వెల్లడించిందని తెలిపారు. కమిషన్ విచారణ కొనసాగుతుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కమిషన్ తన రిపోర్టు ఇచ్చిందని, దాని టర్మ్ ముగిసిందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకూడదని కోర్టు స్పష్టంగా తీర్పు చెప్పిందని, దాని ఆధారంగా సీబీఐ కూడా ఎలాంటి విచారణ చేయరాదని చెప్పారు. కమిషన్ నివేదికను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొనగా.. కోర్టు తీర్పు ప్రకారం నివేదికను రద్దు చేసినట్టేనని ఆయన వివరించారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు తీర్పు చెప్పిందంటే ఆ నివేదిక నిరుపయోగమే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్-21, సెక్షన్(8)లను కమిషన్ రిపోర్టు ఉల్లంఘించిందని ఆయన తెలిపారు.