ఝరాసంగం, ఏప్రిల్ 22 : వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయి లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసం గం మండలంలో నిత్యం విద్యుత్తు కోతలు, వోల్టేజీ హెచ్చుతగ్గులు, నాణ్యమైన విద్యుత్తు లేక 18 నెలల్లో తన బోరుమోటర్ ఆరుసార్లు కాలిపోయిందని, దానిని బాగు చేయించడానికి దాదాపు రూ.40వేలు వెచ్చించినట్టు బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి, రైతు కిశోర్బాబు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్తు సమస్యతో తనతోపాటు తోటి రైతులు ఎదుర్కొంటున్న విషయాలను ఆయన సీఎం కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా విన్నవించారు.
తాను బీహెచ్ఈఎల్లో ఉద్యోగ విరమణ అనంతరం వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఝరాసంగం మండలం ఈదులపల్లి శివారులో ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేసి యాపిల్, డ్రాగన్ఫ్రూట్, మామిడి తోటలను సాగుచేస్తున్నట్టు పేర్కొన్నారు. సరైన విద్యుత్తు అందక బోరు మోటర్లు కాలిపోయి, ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న పంటలు కండ్లముందే ఎండిపోకూడదని, వాటిని బాగు చేయించడంలో వేలరూపాయల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ఈ ప్రాంత రైతులంతా ఇదే సమస్యతో సతమతమవుతున్నారని తెలిపారు.
తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్తు తీగలు 6 అడుగుల ఎత్తు లో వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని, వాటితో తమకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. ఝరాసంగం ఏఈ సరళకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విచారం వ్యక్తం చేశారు. అధికారులకు డజన్ల కొద్దీ ఈ-మెయిళ్లు పంపినా, ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకొని, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం రేవంత్రెడ్డికి ఈ-మెయిల్ పంపినట్టు రైతు కిశోర్ వెల్లడించారు.