దుబాయ్: టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం ఇప్పటికే సెలక్టర్లు 15 మంది సభ్యుల టీమిండియాను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడీ టీమ్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు ప్లేయర్స్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో వరల్డ్కప్ టీమ్ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు అసలు ఫామ్లో లేరు. దీంతో వీళ్ల స్థానంలో లైన్లో ఉన్న ఇతర ప్లేయర్స్కు అవకాశం దక్కనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. టీమ్లో మార్పులు చేసేందుకు అక్టోబర్ 10 వరకూ బీసీసీఐకి అవకాశం ఉంది.
దీంతో ప్రస్తుతం బ్యాకప్ ప్లేయర్గా ఉన్న శ్రేయస్ అయ్యర్కు 15 మంది సభ్యుల్లో చోటు దక్కే చాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్లేయర్స్ ఫామ్ ఆందోళనకరంగానే ఉన్నదని, అయితే వాళ్లు తిరిగి ఫామ్లోకి వస్తారన్న ఆశాభావాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వ్యక్తం చేశారు. అయితే సూర్యకుమార్ ఇండియన్ టీమ్కు బాగానే ఆడాడని, అలాగే ఇషాన్ కిషన్ కూడా శ్రీలంకలో రాణించాడని ఆ అధికారి చెప్పారు. ఈ ముగ్గురూ రానున్న మ్యాచ్లలో అనుకున్న రీతిలో రాణించకపోతే శ్రేయస్ అయ్యర్ బ్యాకప్గా సిద్ధంగా ఉన్నట్లు ఆ అధికారి చెప్పడం గమనార్హం.
కానీ ఇప్పుడే దీనిపై స్పష్టంగా చెప్పడం కష్టమని, ఈ ప్లేయర్స్ తిరిగి ఫామ్లోకి రావడానికి మరో 12 రోజుల సమయం ఉన్నదని సదరు బోర్డు అధికారి అభిప్రాయపడ్డారు. అటు హార్దిక్ పాండ్యా అయితే ఇప్పటి వరకూ ఐపీఎల్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా దీపక్ చహర్ను తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే విరాట్ కోహ్లి కూడా కొన్నాళ్లుగా ఫామ్లో లేకపోయినా.. ఇప్పుడు రెండు వరుస హాఫ్ సెంచరీలు కొట్టాడని, మిగతా ప్లేయర్స్ కూడా అలాగే ఫామ్లోకి వస్తారన్న ఆశాభావాన్ని ఆ అధికారి వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్తోపాటు శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్లాంటి ప్లేయర్స్ కూడా తమకు టీ20 వరల్డ్కప్ టీమ్ నుంచి పిలుపు వస్తుందన్న ఆశతో ఉన్నారు.