Archery | షాంఘై: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో భారత ఆర్చర్లు ఆరు పతకాలు ఖాయం చేశారు. షాంఘై (చైనా) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం ముగిసిన మహిళల రికర్వ్ వ్యక్తిగత క్వార్టర్స్లో భారత సీనియర్ ఆర్చర్ దీపికా కుమారి.. 6-4 (27-28, 27-27, 29-28, 29-27, 28-28) తేడాతో కొరియాకు చెందిన జియోన్ హున్యంగ్ను ఓడించి సెమీస్కు అర్హత సాధించడంతో పతకం ఖాయం చేసుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీస్లో ఆంధ్ర అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ 155-151 తేడాతో మెక్సికోకు చెందిన అండ్రియా బెకెర్ర-లాట్ మ్యాక్సిమోను ఓడించి ఫైనల్ చేరారు.
జ్యోతి ఇదివరకే కాంపౌండ్ వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ ఫైనల్ చేరి పతకాలు ఖాయం చేసుకుంది. పురుషుల కాంపౌండ్, రికర్వ్ జట్లు సైతం ఫైనల్ చేరిన విషయం విదితమే. పురుషుల రికర్వ్ మిక్స్డ్ ఈవెంట్ సెమీస్లో అంకిత-ధీరజ్ జోడీ 0-6 (38-39, 35-36, 36-38) తేడాతో కొరియా ద్వయం లిమ్-కిమ్ చేతిలో ఓడి కాంస్యం పోరుకు సిద్ధమయ్యారు.