ఏటా 70 కోట్ల డోసుల ఉత్పత్తి.. వచ్చే నెలలో 3 కోట్లు: భారత్ బయోటెక్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తన కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచనున్నది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలు, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఏటా 70 కోట్ల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరులోని తమ ప్లాంట్లను దశలవారీగా విస్తరిస్తున్నట్లు మంగళవారం వివరించింది. తద్వారా ఇనాక్టివేటెడ్ (నిర్వీర్యం చేసిన) వైరస్ టీకాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే టాప్ అంతర్జాతీయ కంపెనీల సరసన భారత్ బయోటెక్ చేరనున్నది. ఏటా 20 కోట్ల డోసులు లక్ష్యంగా ఇప్పటికే కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని ప్రారంభించిన భారత్ బయోటెక్.. గత కొంత కాలం నుంచి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నది. మార్చి నెలలో 1.5 కోట్ల డోసులను తయారు చేసింది. వచ్చే నెలలో 3 కోట్ల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. కొవాగ్జిన్ తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ సామగ్రి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లాంటి పదార్థాలకు ఎలాంటి కొరత లేదని కంపెనీ స్పష్టం చేసింది.
పలు మార్గాల్లో ఉత్పత్తి పెంపు
సాధారణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం సుదీర్ఘ ప్రక్రియ అని, రూ.వందల కోట్ల పెట్టుబడి, ఏండ్లపాటు సమయం తీసుకుంటుందని భారత్ బయోటెక్ తెలిపింది. అయితే ఇటీవ బెంగళూరులో తమ ప్లాంట్ సిద్ధం కావడం, ప్రత్యేకంగా డిజైన్ చేసిన బీఎస్ఎల్-3 ల్యాబ్లు అందుబాటులోకి రావడం వంటి కారణాల వల్ల అతి తక్కువ సమయంలోనే కొవాగ్జిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయగలమని ధీమా వ్యక్తం చేసింది. దీంతోపాటు ఇతర దేశాల్లో ఇనాక్టివేటెడ్ వైరస్ టీకాలను తయారు చేస్తున్న తమ భాగస్వామ్య సంస్థలతో కూడా ఉత్పత్తిని పెంచేలా ఒప్పందాలు చేసుకుంటామని వివరించింది. ఇప్పటికే కొవాగ్జిన్కు కావాల్సిన ముడిపదార్థాల తయారీకి ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (ఐఐఎల్) సంస్థతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నది. ఈ సంస్థ ఇనాక్టివేటెడ్ వైరస్ టీకాను ఉత్పత్తి చేయగలదని, ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ సాంకేతికత బదలాయింపుపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.ఇనాక్టివేటెడ్ వైరస్ టీకాల ఉత్పత్తి అత్యంత సంక్లిష్టమైన, భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమని, అయితే లైవ్ వైరస్ వ్యాక్సిన్లతో పోల్చితే ఇనాక్టివేటెడ్ వైరస్ టీకాలు ఎంతో సురక్షితమైనవని, మంచి ఫలితాలు ఇస్తాయని తెలిపింది. ఇప్పటికే మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇరాన్ పరాగ్వే, వెనెజులా, జింబాబ్వే తదితర అనేక దేశాలు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చాయని, ఇదే అంశంపై అమెరికా, యురోపియన్ దేశాలతో చర్చలు జరుగుతున్నాయని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో కొవాగ్జిన్ డోస్కు 15 నుంచి 20 డాలర్ల (రూ.1,100 నుంచి రూ.1,500) వరకు వసూలు చేస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది.
సీరం ఇన్స్టిట్యూట్లోనూ..
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కూడా కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని నెలకు 10 కోట్ల డోసులకు పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎస్ఐఐలో దాదాపు 7 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నారు. తమకు నిధుల కొరత ఉన్నదని, ఆర్థిక సహాయం అందిస్తే ప్లాంట్ను విస్తరించి మరింత జోరుగా కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తామని కంపెనీ సీఈవో అధర్ పూనావాలా ఇటీవలే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఐకి రూ.3,000 కోట్లు, భారత్ బయోటెక్కు రూ.1,500 కోట్ల చొప్పున రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.