WhatsApp | మెటా యాజమాన్యంలో మెసేసింగ్ యాప్ వాట్సాప్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా యుద్ధమే జరుగుతున్నది. ప్రస్తుతం ఈ పోరు తుది దశకు చేరుకున్నది. మెసేజ్ల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విషయంలో బలవంతం చేస్తే భారత్ను వీడాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకువచ్చిన 2021 నాటి ఐటీ నిబంధనలు సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా కంపెనీలు గతంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లపై గురువారం ఢిల్లీ కోర్టు విచారణ జరిపింది.
ఐటీ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం కోరిన సమయంలో సందేశాల ఎన్క్రిప్షన్ తొలగించి సమాచార మూలాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం ఐటీ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదైనా మెసేజ్ వాట్సాప్లో ఎక్కడి వచ్చింది.. ఎవరు ఎవరికి పంపారనే వివరాలు ప్రభుత్వం అడిగిన సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కుదరదని మెటా కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఏ సమాచారం కోరుతుందో ముందుగానే తెలియదని.. కోరిన సమయంలో డీక్రిప్ట్ యడానికి కోట్లాది సందేశాలను ఏళ్ల తరబడిగా స్టోర్ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపింది. ఈ విషయమై వాదులు, ప్రతివాదుల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా అమలులో ఉందా? అన్న ప్రశ్నకు బ్రెజిల్ లాంటి దేశాల్లో సైతం ఈ రూల్స్ లేవని మెటా తరఫున లాయర్లు తెలిపారు. అయితే, ప్రైవసీ అనేది అనుల్లంఘనీయం కాదన్న కోర్టు.. అవసరాలకు హక్కులకు మధ్య సమతౌల్యం ఉండాలని పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మార్గదర్శకాలు పాటించడం అవసరమని స్పష్టం చేశారు. అభ్యంతరకర కంటెంట్తో పాటు ఉగ్రవాదం, సమాజంలో హింసకు కారణమయ్యే కంటెంట్కు సంబంధించిన మూలాలను తెలియజేయాల్సిందేనని తెలిపారు.