పల్లె అయినా.. పట్నమైనా.. చిన్న జిల్లా అయినా.. ఉమ్మడి జిల్లా అయినా.. ఉపఎన్నిక అయినా.. సార్వత్రికమైనా.. ఓటర్లు విద్యావంతులైనా.. నిరక్షరాస్యులైనా..మండలి పోరైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా..
ఫలితం ఏకపక్షమే.. విజయం టీఆర్ఎస్దే!
మినీ పురపోరులో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఎన్నికలు జరిగిన రెండు నగరాలు వరంగల్, ఖమ్మం… ఐదు పట్టణాలు సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరుల్లో.. అన్నిటికి అన్నిచోట్లా టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి పాలక మండళ్లను కైవసం చేసుకున్నది. మున్సిపోల్స్లో భాగంగా మొత్తం 248 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరుగగా అందులో 181 సీట్లలో.. ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. మిత్రపక్షం సీపీఐకి వచ్చిన రెండు స్థానాలు కలుపుకొంటే 74% స్థానాలు గెలిచినట్టయ్యింది.
ఆరు జిల్లాల పరిధిలోని పట్టణాల్లో మున్సిపోల్స్ జరిగాయి. ఇటీవల రెండు ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికలు ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటికి తోడు యోధానుయోధుడిగా చెప్పుకొనే జానారెడ్డి పోటీచేసిన సాగర్ ఉపఎన్నిక. అన్నిచోట్లా గులాబీ వికాసమే. బరిలో మేమున్నామంటూ తొడలు గొడుతున్న బండ పార్టీలను ఓట్ల బండకేసి ఉతికిపారేశారు జనం.. పేరు గొప్ప పాత పార్టీలకు పాతరేశారు జనం. వారు ఇస్తున్న సందేశమొక్కటే
తెలంగాణ అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే విజయం
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తంగా 248 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే.. 181 సీట్లలో గులాబీ గుబాళించింది. మిత్రంపక్షం సీపీఐకి లభించిన రెండు స్థానాలు కలుపుకొంటే.. 74% సీట్లను కైవసం చేసుకున్నది. పలుచోట్ల గెలిచినవారిలో టీఆర్ఎస్ రెబెల్స్ కూడా ఉన్నారు. వారిని కూడా లెక్కలోకి తీసుకుంటే.. ఈ శాతం మరింత పెరుగనున్నది. ఇప్పటికే ఇందులో చాలామంది టీఆర్ఎస్ గూటికి తిరిగి వస్తున్నారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకాగా.. అన్నిచోట్లా ఆది నుంచీ టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. సాయంత్రం ఫలితాలు వెల్లడయ్యాయి.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 66 సీట్లకుగాను 48 సీట్లలో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఇక్కడ బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఏఐఎఫ్బీ 1 స్థానం గెల్చుకోగా, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. ఖమ్మంలో మొత్తం 60 స్థానాలకుగాను 43 స్థానాల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. టీఆర్ఎస్, సీపీఐ కూటమిగా పోటీ చేసి 45 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఇందులో ఒక స్థానం ఏకగ్రీవమైంది. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు టీఆర్ఎస్ 36 వార్డులు గెలిచింది. నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు టీఆర్ఎస్ 11 చోట్ల గెలుపొందింది. జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డులకు టీఆర్ఎస్ 23 వార్డులను గెలిచింది. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను టీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలుపొందింది. అచ్చంపేటలో 20 వార్డులకు టీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగిన గజ్వేల్ మున్సిపాలిటీలోని 12 వార్డు, నల్లగొండలోని 26వ వార్డు, బోధన్లోని 18వ వార్డులో టీఆర్ఎస్ విజయం సాధించింది. పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ, జీహెచ్ఎంసీలో లింగోజిగూడ 18 డివిజన్లో కాంగ్రెస్ గెలిచాయి.
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగింది. పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరిచారు. ఈ ప్రక్రియ అంతా వీడియో తీశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను ముందు రోజు ఆదివారం ఉదయం, సాయంత్రం, సోమవారం ఉదయం శానిటైజ్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందే పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు, కౌటింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులకు, బందోబస్తులో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించామన్నారు. మొత్తం 6,559 మందికి పరీక్షలు నిర్వహించగా 308 మందికి పాజిటివ్గా తేలడంతో వారిస్థానంలో ఇతరులను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించామన్నారు. ఓట్ల లెక్కింపుకేంద్రాల వద్ద, ఆయా పట్టణాల్లో జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలను నిషేధించినట్లు కమిషనర్ తెలిపారు.
టీఆర్ఎస్ మాత్రమే ప్రజలపార్టీ : సీఎం
మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్ఎస్ను, 3 సీట్లలో మిత్రపక్షం సీపీఐని గెలిపించి మొత్తం 184 స్థానాలు కట్టబెట్టి, గులాబీ జెండాకు తిరుగులేదని ప్రజలు మరోమారు నిరూపించారు. టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిషర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టీఆర్ఎస్కు ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన ఏడు మున్సిపాలిటీల ప్రజలందరికీ ధన్యవాదాలు.
టీఆర్ఎస్ పాలనకు పట్టం గట్టినప్రజలు
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మెచ్చి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్కు ఘన విజయాన్ని అందించారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో 36 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. 5 స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు స్వతంత్రులుగా గెలుపొందారు. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు కేవలం ఒక్కో స్థానానికే పరిమితమవ్వడం టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వసనీయతకు నిదర్శనం.
సందర్భం ఏదైనా విజయం టీఆర్ఎస్దే
సందర్భం ఏదైనా విజయం టీఆర్ఎస్ పార్టీకే సొంతం. సీఎం కేసీఆర్ నాయకత్వం మీద పెరుగుతున్న విశ్వసనీయతకు నకిరేకల్ పురపాలక ఎన్నికలు అద్దం పడుతున్నాయి. అడ్డగోలు మాటలు మాట్లాడిన విపక్షా లకు ప్రజలు తగిన బుద్ది చెప్పారు. కర్రుకాల్చి వాత పెట్టారు. ప్రజలు చీదరించుకొన్ని విషయాన్ని ఇకనైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గుర్తించాలి. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులను అభినందనలు.
సీఎం కేసీఆర్ వెంటే ప్రజలు
ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టంగట్టి ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నట్టు నిరూపించారు. ఏడేండ్లుగా నగరంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పట్టి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఓటర్లు టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా భావించారు. బీజేపీ అబద్ధపు ప్రచారాలను ఓటర్లు తిప్పికొట్టారు. ఎన్నికల ప్రచారంలో శక్తివంచన లేకుండా పనిచేసిన ఎంపీ నామాతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్లు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపించాయి
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను విజయపథంలో నిలిపాయి. కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగురడం శుభపరిణామం. విజయంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు. విజేతలు మరింత బాధ్యతతో అభివృద్ధి కోసం పాటుపడాలి.
వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు..
గ్రేటర్ వరంగల్ మరింత అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ప్రజలు టీఆర్ఎస్కు తిరుగులేని విజయాన్ని అందించారు. ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్ఎస్దేనని మరోసారి రుజువైంది. టీఆర్ఎస్తోనే వరంగల్ మహానగరం అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు గట్టిగా విశ్వసించారు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులను మంచి మెజార్టీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని, నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపుతాం.
కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో విశ్వాసం
ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఎంత విద్వేషాన్ని ఎగజిమ్మినా తెలంగాణ కేసీఆర్తోనే ఉంటుందని మినీ మున్సిపోల్స్ నిరూపించాయి. స్వాభిమానం, ఆత్మగౌరవం నిలిపే టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70 శాతం తెలంగాణ విద్యావంతులు, నిన్నటి సాగర్, నేటి పురపాలక ఎన్నికల్లో ప్రజలు పునరుద్ఘాటించారు. చిల్లర మాటలతోని, అర్థంలేని ఆరోపణలతోని, కడుపు నింపని విద్వేషాలతోని ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ ప్రజల సంస్కారం ముందు అవన్నీ చిన్నబోయాయి. – గంగుల కమలాకర్, పౌరసరఫరాలశాఖ మంత్రి