Sodium Battery | న్యూఢిల్లీ: సెకన్లలోనే రీచార్జ్ చేయగల, అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాంకేతిక ఆవిష్కరణలో ఇదొక పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు. సోడియం అయాన్ హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ సెల్స్ తయారీపై సైంటిస్టులు దృష్టిసారించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో అధిక శక్తితో కూడిన ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ పరికరాలకు ప్రస్తుతం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది.
లిథియం అయాన్ బ్యాటరీలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అధ్యయనంలోని ముఖ్యాంశాల్ని పేర్కొంటూ ‘జర్నల్ ఎనెర్జీ స్టోరేజ్ మెటీరియల్స్’ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రస్తుతం తయారవుతున్న బ్యాటరీలన్నీ లిథియం ఖనిజంతోనే. ఇది భూమిపై స్వల్పంగా లభ్యమవుతున్నది. లిథియం లభ్యతతో పోల్చితే సోడియం లభ్యత 1000 రెట్లు ఎక్కువ. మన చుట్టూ ఉన్న వనరులతో పోల్చితే, సోడియం అయాన్ను రసాయన, విద్యుత్ శక్తి రూపంలో నిల్వ చేయటం చౌకైన, సాధ్యమయ్యే శక్తి వనరుగా నిలుస్తుంది.