Riyan Parag: ఆట కంటే ఎక్కువగా ప్రత్యర్థులతో పాటు తన సొంత జట్టు ఆటగాళ్లపైనా అటిట్యూడ్ చూపించే అస్సాం యువ క్రికెటర్ రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఛత్తీస్గఢ్తో ముగిసిన మ్యాచ్లో అస్సాం తరఫున ఆడుతున్న పరాగ్.. 56 బంతుల్లోనే సెంచరీ చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసిన భారత ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. అస్సాం సారథిగా కూడా వ్యవహరిస్తున్న పరాగ్.. ఈ మ్యాచ్లో 87 బంతుల్లోనే 11 బౌండరీలు, 12 భారీ సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేశాడు. అయితే 56 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా పరాగ్.. విండీస్ దిగ్గజం వివిన్ రిచర్డ్స్ సరసన చేరాడు. 1985-86 సీజన్లో వివిన్ రిచర్డ్స్.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో భాగంగా 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తాజాగా పరాగ్.. రిచర్డ్స్ రికార్డును సమం చేశాడు.
భారత్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో పరాగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శక్తి సింగ్ (45 బంతులలో), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (48 బంతులు), యూసుఫ్ పఠాన్ (51 బంతులు)లు పరాగ్ కంటే ముందున్నారు. అస్సాంకే చెందిన ఆర్కె బోరా.. 1987-88 రంజీ సీజన్లో 56 బంతుల్లోనే శతకం బాదాడు. ఇక పరాగ్ రాణించినా అస్సాం మాత్రం ఈ మ్యాచ్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రాయ్పూర్ వేదికగా ముగిసిన మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్గఢ్.. తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులు చేసింది. అనంతరం అస్సాం ఫస్ట్ ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్లో 254 పరుగులు చేసింది. 87 పరుగుల లక్ష్యాన్ని ఛత్తీస్గఢ్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది.
WHAT AN INNINGS PLAYED BY RIYAN PARAG…!!!!
He smashed 155 runs from 86 balls for Assam in Ranji Trophy – One of the finest Knock in Ranji Trophy history. pic.twitter.com/EXivepX1xh
— CricketMAN2 (@ImTanujSingh) January 8, 2024
ఆటగాడిగా రాణిస్తున్నా ఐపీఎల్లో రియాన్ పరాగ్ ఆన్ ది ఫీల్డ్తో పాటు ఆఫ్ ది ఫీల్డ్లో అతడు చేసే చేష్టల కారణంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కుంటున్నాడు. ఐపీఎల్ టైమ్ లో అయితే అతడు ట్రోలర్స్కు కంటెంట్ అందివ్వడంలో ముందుంటాడు. తనను తాను ఫినిషర్గా, మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా అభివర్ణించుకుంటూ చేసే వ్యాఖ్యలు గతంలో నెట్టింట వైరల్ అయ్యాయి.