CWC 2023: రెండ్రోజుల క్రితం భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ పలు పాత రికార్డులను బద్దలుకొట్టింది. ఆటలోనే గాక ఆటేతర విషయాలలో కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా రికార్డులు సృష్టించింది. 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీని స్టేడియాలకు వచ్చి చూసినవారి సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. భారత్లోని పది నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చూసినవారి సంఖ్య అక్షరాలా 12 లక్షల 50 వేల 307 మందిగా నిర్దారించింది. ఇప్పటివరకూ జరిగిన ఏ ఒక్క ఐసీసీ ఈవెంట్కూ ఇంతమంది రాలేదు.
వాస్తవానికి అక్టోబర్ 05న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ప్రేక్షకులే కనిపించలేదు. దాదాపు స్టేడియం అంతా ఖాళీగానే దర్శనమిచ్చింది. ఆ తర్వాత భారత్ ఆడే మ్యాచ్లు మినహా అంతా చప్పచప్పగానే సాగింది. కానీ నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్ల అనూహ్య విజయాలు, సౌతాఫ్రికా ఆటగాళ్ల మెరుపు బ్యాటింగ్కు తోడు ఉత్కంఠ మ్యాచ్లు కూడా అభిమానులను స్టేడియాలకు రప్పించాయి. వరల్డ్ కప్ మిడ్ షెడ్యూల్ ముగిసేసరికి ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చూసిన వారి సంఖ్య ఏకంగా ఐదు లక్షలు దాటింది.
The biggest EVER 👏 🥳
Thank YOU to all of our fans who helped make #CWC23 the most attended yet! 🏟
More 📲 https://t.co/4womT6R5rv pic.twitter.com/cqNwNlPPsp
— ICC (@ICC) November 21, 2023
ఇక నాకౌట్ మ్యాచ్లకు కూడా ఫ్యాన్స్ ఎగబడి హాజరయ్యారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య వాంఖెడే వేదికగా జరిగిన తొలి సెమీస్కు మొత్తం స్టేడియం నిండిపోయింది. ఆసీస్ – సౌతాఫ్రికా మధ్య కోల్కతాలో జరిగిన రెండో సెమీస్లో కూడా ఈడెన్ గార్డెన్స్ కూడా దాదాపు నిండింది. భారత్ – ఆసీస్ మధ్య అహ్మదాబాద్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ను ప్రత్యక్షంగా వీక్షించినవారి సంఖ్య సుమారు 95వేలకు తగ్గలేదు.