RCB | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట (stampede) ఘటన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారి సహాయార్థం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
‘నిన్న బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటన ఆర్సీబీ కుటుంబానికి తీవ్ర బాధను కలిగించింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అంతేకాదు, గాయపడిన అభిమానులను ఆదుకునేందుకు ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తాం’ అని ఆర్సీబీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేస్తామని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వెల్లడించారు.
𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗦𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁: 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂
The unfortunate incident in Bengaluru yesterday has caused a lot of anguish and pain to the RCB family. As a mark of respect and a gesture of solidarity, RCB has announced a financial… pic.twitter.com/C50WID1FEI
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 5, 2025
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (stampede) జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్న వారినే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read..
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట.. మృతులు వీళ్లే..
Harsh Goenka | దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా..? తొక్కిసలాట ఘటనపై హర్ష్ గోయెంకా పోస్ట్