Ranji Trophy 2024 | దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న క్వార్టర్స్ మ్యాచ్లలో డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్రకు తమిళనాడు షాకిచ్చింది. రంజీట్రోఫీ – 2024 క్వార్టర్ ఫైనల్స్లో తమిళనాడు.. సౌరాష్ట్రను ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. కెప్టెన్ సాయి కిశోర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో తమిళనాడు ఏడేండ్ల తర్వాత రంజీ సెమీస్లోకి అడుగుపెట్టింది. 2016-17 తర్వాత ఆ జట్టు సెమీస్ చేరడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
కోయంబత్తూరులోని ఎస్ఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే ఆలౌట్ అయింది. తమిళనాడు సారథి సాయి కిషోర్.. 5 వికెట్లు పడగొట్టగా అజిత్ రామ్ మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు.. 338 పరుగులు చేసింది. సాయి కిషోర్ (60), ఇంద్రజిత్ (80), భూపతి కుమార్ (65)లు రాణించారు. రెండో ఇన్నింగ్స్లోనూ సౌరాష్ట్ర మరోమారు చేతులెత్తేసింది. ఆ జట్టు 122 పరుగులకే కుప్పకూలింది. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే.. 46 పరుగులతో టాప్ స్కోరర్. సౌరాష్ట్ర సెకండ్ ఇన్నింగ్స్లో సాయి కిషోర్.. 4 వికెట్లు పడగొట్టడం విశేషం.
TAMIL NADU QUALIFIED INTO THE RANJI TROPHY SEMI-FINAL AFTER 7 LONG YEARS. 🤯
– Sai Kishore & his boys have created history by defeating the mighty Saurashtra…!!!! pic.twitter.com/QBd7vTuwbU
— Johns. (@CricCrazyJohns) February 25, 2024
సెమీస్కు అడుగుదూరంలో ఆంధ్రా..
ఆంధ్రప్రదేశ్ – మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న మరో క్వార్టర్స్లో ఆంధ్రా జట్టు సెమీస్కు చేరువలో నిలిచింది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 234 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆంధ్రా.. 172 పరుగులే చేయగలిగింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్.. 107 రన్స్కే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో 170 పరుగుల ఛేదనతో బరిలోకి దిగిన ఆంధ్రా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమా విహారి (43 బ్యాటింగ్), కృదాంత్ కరణ్ షిండె (5 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. ఆంధ్రా విజయానికి మరో 75 రన్స్ మాత్రమే కావాలి.