Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో మరో కొత్త వివాదం రాజుకుంది. పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ను సెలక్షన్ కమిటీ సభ్యుడిగా తీసుకోవడంపై పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక కళంకితుడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని, దీని ద్వారా పాకిస్తాన్ క్రికెట్కు ఏం సందేశం ఇస్తున్నట్టని ఆయన వాపోయాడు. పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో ఇదివరకే కమ్రాన్ అక్మల్, వహబ్ రియాజ్ (చీఫ్ సెలక్టర్), అంజుమ్లను తీసుకోగా శుక్రవారం ఈ బోర్డులో భట్ను తీసుకోవడం చర్చనీయాంశమైంది.
భట్ను సెలక్షన్ కమిటీలో తీసుకోవడంపై రమీజ్ రాజా స్పందిస్తూ… సెలక్షన్ కమిటీలో ఓ కళంకితుడిని తీసుకోవడం వెర్రితనంగా ఉంది.. అని అన్నాడు. 2010లో పాకిస్తాన్ క్రికెట్ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సల్మాన్ భట్ కూడా ఉన్నాడు. అతడిపై ఐదేండ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. తిరిగి అతడు 2016లో క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. భట్తో పాటు ఉమర్ అక్మల్ (కమ్రాన్ అక్మల్ సోదరుడు) కూడా అవినీతి మరకలు అంటించుకున్నవాడే. పాకిస్తాన్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 33 టీ20లు ఆడిన భట్.. తన కెరీర్లో 5,209 పరుగులు సాధించాడు.
Ramiz Raja said “It’s insane to have the selection committee consisting of a member who was locked up for match fixing.”#CricketTwitter pic.twitter.com/7CwGZuZKyJ
— Himanshu Pareek (@Sports_Himanshu) December 1, 2023
ఇక పాకిస్తాన్ స్పాట్ ఫిక్సింగ్లో మరో నిందితుడు మహ్మద్ అమిర్ను వహబ్ రియాజ్ తిరిగి జట్టులోకి ఆహ్వానించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి కళంకిత క్రికెటర్ల వల్ల పాకిస్తాన్ క్రికెట్ మసకబారుతుందని రమీజ్ రాజా అన్నాడు. ఇదిలాఉండగా కొత్తగా నియమితులైన సెలక్టర్లు వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ తో ఐదు టీ20ల సిరీస్లో జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.