CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్నట్టు వైరల్ అయిన ఓ ఫేక్ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మే నెల ఒకటో తేదీన జరుగనున్న విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. ఆ వీడియోను షేర్ చేసిన రేవంత్తోపాటు తెలంగాణ కాంగ్రెస్కు చెందిన మరో నలుగురికి ఈ నోటీసులు అందాయి. విచారణకు వచ్చేటప్పుడు తమ మొబైల్ ఫోన్లను తీసుకొని రావాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్క్రైం కోఆర్డినేషన్ సెంటర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ దర్యాప్తును ప్రారంభించింది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీశ్, శివకుమార్, తస్లీమ్ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. అయితే వీళ్లు అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో లీగల్ సెల్ ఇన్చార్జి రామచంద్రారెడ్డి ఆ నోటీసులను స్వీకరించారు.
ఫేక్ వీడియో ఆధారంగా రేవంత్ పీసీ
రేవంత్రెడ్డి ఈ ఫేక్ వీడియో ఆధారంగా ఏకంగా ప్రెస్మీట్ కూడా పెట్టి అమిత్షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రేవంత్రెడ్డి, ఆయన బృందంలోని సభ్యులు దేశ హోంశాఖ మంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోలను వ్యాప్తిచేయడం, రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదించేందుకు ప్రయత్నించడం తీవ్రమైన నేరమని ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్రెడ్డి స్పందించారు. బీజేపీ ఇప్పటివరకు సీబీఐ, ఈడీలను ఉపయోగించిందని, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను వాడుతున్నదని అన్నారు.
నోటీసులు తీసుకున్నాం: కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్చార్జి
ఢిల్లీ పోలీసులు సోమవారం గాంధీభవన్కు వచ్చారని, ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి వచ్చి నోటీసులు అందజేశారని కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ ఇన్చార్జి రామచంద్రారెడ్డి చెప్పారు. మే ఒకటో తేదీన విచారణకు రావాలని అడిగారని, తాము 15 రోజులు గడవు అడిగామని చెప్పారు.
అసలేంటి ఈ కేసు?
అమిత్షా ఇటీవల రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణలో ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, తాము కేంద్రంలో మరోసారి ప్రభు త్వం ఏర్పాటుచేసిన తర్వాత వాటిని రద్దు చేస్తామని అన్నారు. ఈ వీడియోను మార్ఫింగ్ చేసి.. అమిత్షా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నట్టుగా మార్చివేశారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిందని, ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు రీపోస్టు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసుల లేఖ!
ఢిల్లీ పోలీసులు ఈ వీడియో షేరింగ్ ఎక్కడి నుంచి ప్రారంభమైందనే దానికి సంబంధించి ‘మూలాలు’ తెలుసుకొనేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు? మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకొనేందుకు సమాచారం అందజేయాలని కోరింది.
ఈసీకి బీజేపీ ఫిర్యాదు
అమిత్షా వీడియో వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఫేక్ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నదని, ఆ పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, బీజేపీ మీడి యా సెల్ ఇన్చార్జి అనిల్ బలూని ఈసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు రాజస్థాన్ బీజేపీ విభాగం సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అస్సాంలో కాంగ్రెస్ నేత అరెస్టు
అమిత్షా ‘ఫేక్ వీడియో’ను షేర్ చేసిన గువాహటికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. అరెస్టయిన 31 ఏండ్ల రీతోం సింగ్కు రాష్ట్ర కాంగ్రెస్తో సంబంధం ఉన్నదని, ఆయన పార్టీ ‘వార్ రూమ్ కోఆర్డినేటర్’గా పనిచేస్తున్నారని తన ఎక్స్లో ఖాతాలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అమిత్షాపై ఫేక్ వీడియో ప్రచారానికి సంబంధించి ఫిర్యాదు మేరకు పాన్బజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని అస్సాం పోలీసు ఉన్నతాధికారి ప్రణబ్జ్యోతి గోస్వామి పేర్కొన్నారు. రీతోం సింగ్ నుంచి పోలీసులు రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొన్నారు.
అమిత్ షా ఫేక్ వీడియో.. రేవంత్ రెడ్డి కుట్ర
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నట్టుగా సృష్టించిన ఫేక్ వీడియోలు కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి చేసిన కుట్రను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. పలువురు నాయకులు బీజేపీలో చేరిన సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్లు తీసేస్తారని, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై, ఆర్ఎస్ఎస్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమన్నారు. ఆయనకు నైతికత ఉంటే వెంటనే వెనకి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి తన ప్రసంగాల ద్వారా, కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూ కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి తీవ్రవాదిలాగా దేశద్రోహానికి పాల్పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. రేవంత్రెడ్డి బుడ్డర్ ఖాన్ తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.