2014లో అధికారంలోకి రావడానికి ముందు నరేంద్ర మోదీ రైతులపై ఎన్నో హామీలు కురిపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరను (ఎమ్మెస్పీ) నిర్ణయించి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే సేకరిస్తుందని వాగ్దానం చేశారు. 200 పనిదినాలు, వ్యవసాయ కూలీలకు అధిక వేతనాలు, పంటలకు బీమా, ప్రతీ పొలానికీ నీరు, ఉచితంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ ఇలా.. ఎన్నోన్నో హామీలు కురిపించారు. ఇవన్నీ నమ్మి ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే, పదేండ్లు గడిచినప్పటికీ ఇచ్చిన ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు.
Farmers | మోదీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన పంటల బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ అన్నదాతలను ఎంతవరకు ఆదుకొన్నదన్న మాట అటుంచితే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం కల్పవృక్షంగా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2016-20 వరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.2,415.88 కోట్లను బీమా రుసుం కింద రైతులు చెల్లిస్తే, బీమా కంపెనీలు మాత్రం రైతులకు క్లెయిమ్ల రూపంలో చెల్లించిన మొత్తం రూ.1,871.54 కోట్లు మాత్రమే. ఈ లెక్కన కంపెనీలు రూ.544.34 కోట్లు లాభపడ్డాయి.
మోదీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న మరో పథకం ‘హర్ ఖేత్ కో పానీ’. ఏటా ఈ పథకంపై రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తామంటూ ప్రకటించిన మోదీ ప్రభుత్వం.. మొత్తంగా పదేండ్లలో లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా రూ.30 వేల కోట్లు కూడా వ్యయం చేయలేదని గణాంకాలు చెప్తున్నాయి. ఉపాధి హామీ పథకానికి కూడా బడ్జెట్ కేటాయింపుల్లో 33 శాతం వరకూ కోత పెట్టారు. వెరసి మన్నులో బంగారు పంటలను పండించే రైతన్న అప్పుల బాధలు భరించలేక, పెరిగిన ఖర్చులతో కుటుంబాన్ని పోషించలేక అదే మన్నులో కలిసిపోతున్నాడు.
పదేండ్ల బీజేపీ సర్కార్ హయాంలో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యవసాయరంగ నిపుణులు, మేధావులు చెప్తున్నారు. ఆదాయం లేక, అప్పుల బాధలు భరించలేక 2014 నుంచి 2023 వరకు దాదాపు లక్షా 12 వేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే దేశంలో రోజుకు సగటున 31 మంది రైతులు ఎక్కడో చోట అసువులు బాస్తూనే ఉన్నారు. ఇక ఇదే కాలంలో రోజువారీ కూలీల ఆత్మహత్యల సంఖ్య మరో 3,12,214గా ఉన్నది. వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోవడమే ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఓ నివేదిక అంచనా ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.74,121 అప్పు ఉన్నట్టు తెలుస్తున్నది. 2013తో పోలిస్తే రైతుల అప్పు ప్రస్తుతం 57 శాతం పెరిగినట్టు సమాచారం.
బీజేపీ సర్కారుపై రైతన్న ఎన్నడూ లేనంత అసహనంతో ఉన్నాడు. ఇది నిజం. పంజాబ్, హర్యానాల్లో ఓట్లడగటానికి గ్రామాల్లోకి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు పొలిమేరల దాకా వెంటాడి తరమడమే దీనికి రుజువు. ఎమ్మెస్పీపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్న కేంద్రంపై మొన్నటికి మొన్న సమరశంఖం పూరించిన అన్నదాతలు.. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలనూ ఉధృతం చేశారు. రెండు మూడు రోజుల కిందటే తమిళనాడుకు చెందిన దాదాపు 200 మంది రైతులు ఎముకలు, పుర్రెలతో జంతర్మంతర్ దగ్గర నిరసనలకు దిగడం అంతర్జాతీయ మీడియాలోనూ ప్రధానాంశమైంది. ఆ పుర్రెలు ఎవరివో కాదు, కేంద్ర అసమర్థ విధానాలు, అబద్ధపు హామీలను నమ్మి అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడిన వందలాది అన్నదాతలవే.
తొలిసారి మోసపోతే.. ‘పాపం! అమాయకత్వం పోనీలే’ అంటాం. రెండోసారి అలాగే మోసపోతే, ‘తెలుసుకోవాలి కదా! ఇంకెన్ని సార్లు చెప్తాం’ అని చిరుకోపం చూపించి కాస్త ఓదారుస్తాం. మూడో సారి అలాగే జరిగితే, ‘అవివేకం కాక మరేమిటి? ఆ మాత్రం జ్ఞానం ఉండాలిగా’ అంటూ మండిపడ్తం.
భూమి నుంచి బువ్వను పుట్టించే రైతన్నకు ఇది తెలియంది కాదు. అందుకే, రెండుసార్లు నమ్మి మోసపోయిన అన్నదాత.. ఈ ఎన్నికల్లో మోసం చేసిన వారిని ఎలా దెబ్బకొట్టాలో దృఢంగా నిర్ణయించుకున్నాడు. అవును, రెండున్నరేండ్ల కిందట క్షమాపణలు చెప్తే శాంతించి మన్నించిన అన్నదాత, ఇప్పుడు హస్తిన పెద్దలకు సిరాచుక్కతో బుద్ధి చెప్పాలనుకొంటున్నాడు. తొలి రెండు దఫాల పోలింగ్లో అది స్పష్టంగా కనిపించింది కూడా.
– కడవేర్గు రాజశేఖర్