Handloom | సిరిసిల్ల అంటేనే వలసలకు కేరాఫ్ అడ్రస్, ఆత్మహత్యలకు చిరునామా. పాపం.. ఉమ్మడి పాలనలో ఇదీ సిరిసిల్ల నేతన్నల పరిస్థితి. నాడు సిరిసిల్ల కాస్తా ఉరిసిల్లగా మారిపోయింది. నాటి పాలకులు నేతన్నలను కేవలం ఓటు బ్యాంకుగానే చూడటంతో సాంచల సప్పుడు కనుమరుగైంది. సరిగ్గా అలాంటి పరిస్థితులే రాష్ట్రంలో మళ్లీ పునరావృతమవుతున్నాయి. నాలుగు నెలల కాంగ్రెస్ పాలన నేతన్నల బతుకులను అలకల్లోలం చేస్తున్నది.
వలస పాలనలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నేతన్నల బతుకులకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ఊపిరులూదింది. స్థానిక ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నేతన్నల వెతలు దూరమయ్యాయి. ఉరిశాలగా మారిన సిరిసిల్ల సిరుల సిల్లగా మారింది. అందుకే గత రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కేటీఆర్ వెన్నంటే నిలుస్తున్నారు. స్వపరిపాలనలో చేనేత పరిశ్రమ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించిన కేసీఆర్ సర్కార్ రాయితీలతో పాటు నేత కార్మికులకు పింఛన్లు కూడా మంజూరు చేసింది. బతుకమ్మ చీరల తయారీ కోసం ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు శాశ్వత ఉపాధిని కల్పించింది. దీంతో సిరిసిల్ల మరో షోలాపూర్గా రూపుదిద్దుకున్నది. వలసలు పోయిన చేనేత కార్మికులు సిరిసిల్లకు వాపస్ వచ్చిండ్రు. వర్కర్ టూ ఓనర్ పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతి కార్మికుడికి షెడ్డుతో పాటు నాలుగు అత్యాధునిక మరమగ్గాలనూ అందించింది. రూ.174.65 కోట్లతో 64 ఎకరాల్లో నిర్మించిన అపెరల్ పార్క్లో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా సకల వసతులను కల్పించింది.
రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన వస్ర్తాలు గతంలో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అయ్యేవి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ ఆర్డర్లను కూడా రాష్ట్రంలోని నేతన్నలకే ఇచ్చింది కేసీఆర్ సర్కార్. దీంతో కార్మికులకు చేతినిండా పని దొరికింది. మగ్గాల ఆధునికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్తో అనుసంధానం వంటి ఆల్రౌండ్ అప్రోచ్తో ముందుకుసాగింది. వీటితో పాటు బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్ర్తాల ఆర్డర్లు కూడా అందడంతో సిరిసిల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఆ మహాయజ్ఞం ఎన్నో గొప్ప ఫలితాలనిచ్చింది.
కానీ, చేతినిండా పనులతో కళకళలాడిన నేతన్నలు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువును ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలనలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్లీ అలాంటి విపత్కర పరిస్థితినే చవిచూస్తున్నది. అబద్ధపు హామీల పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను నిలిపివేసి నేతన్నల బతుకులను రోడ్డుకీడ్చింది. ఫలితంగా నేతన్నల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు చేనేత కార్మికులను పావులుగా వాడుకోవాలని చూడటం సరికాదు. ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటు.
పదేండ్ల పాటు ప్రజ్వరిల్లిన వస్త్ర పరిశ్రమ చుట్టూ మళ్లీ అంధకారం అలుముకుంటున్నది. చేనేత పరిశ్రమ, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కారు ఇకనైనా తన తీరును మార్చుకోవాలి. భేషజాలకు పోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలి. దీంతోపాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
చేనేత కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. తమిళనాడు, సూరత్కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వెలువడుతుండటమే అందుకు నిదర్శనం. నేతన్నల సంక్షోభాన్ని రాజకీయ కోణంలో కాకుండా పేద, బడుగు, బలహీనవర్గాలైన నేతన్నల కోణంలో చూడాలి. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తద్వారా నేతన్నల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ధి చెప్తారు.