Motkupalli Narasimhulu | రవీంద్రభారతి, ఏప్రిల్ 29: రాష్ట్రంలో మాదిగలకు ఒక్క లోక్సభ సీటు ఇవ్వకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. మాదిగలెవరూ కాంగ్రెస్కు పార్టీకి ఓటేయవద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 14 ఎంపీ సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మాదిగ జాతిని బొంద పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం లో 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఎందుకు ఇవ్వలేదో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ‘అన్ని సీట్లు మీ కులానికే ఇచ్చుకుంటే.. మిగతా జాతులు ఏం కావాలి? పార్టీ అధిష్ఠానం మిగతా కులాలకు ఇవ్వద్దని చెప్పిందా? ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
వర్గీకరణ బిల్లుపై ఎవరు మాట్లాడుతారు?
‘రేపు పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు వస్తే మాదిగవాడు ఉండవద్దా? ఇది ఏ రకంగా సహించాలి. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లోకి రాకుండా రేవంత్రెడ్డి భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు’ అంటూ మోత్కుపల్లి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్కు సీటు ఇవ్వకుండా, బీఆర్ఎస్ను మోసం చేసి వచ్చిన కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకు వరంగల్ సీటు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని, యావత్ మాదిగ జాతి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. మే 4న ఇందిరాపార్క్ లేదా బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద భారీ ధర్నా, నిరసన ప్రదర్శనలు చేస్తామని మాదిగలంతా లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రాజకీయ ఎదుగుదలకు మాదిగలే ప్రధానపాత్ర పోషించారని స్వయంగా ఆయనే చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని మూడు రిజర్వుడ్ స్థానాలలో ఒక్కటి కూడా మాదిగల కు ఇవ్వకపోవడం దారుణమని విమర్శించా రు. కాంగ్రెస్పార్టీ చేసిన ద్రోహంపై రాష్ట్రమం తా యాత్రలు నిర్వహిస్తామని చెప్పారు.
కడియం శ్రీహరి ఎస్సీనే కాదు..ఆయన బిడ్డ ఎలా అవుతుంది?
హనుమకొడ చౌరస్తా, ఏప్రిల్ 29: ‘కడియం శ్రీహరి ఎస్సీనే కాదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ రోజుల్లోనే చెప్పాడు. ఇప్పుడు ఆయన బిడ్డ కడియం కావ్యకు టికెట్ ఇస్తే ఆమె ఎలా ఎస్సీ అవుతుంది. కావ్యకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేశారా..లేదా ముస్లింల ప్రకారం మతపెద్దలు నిఖా చేశారా కడియం శ్రీహరి బహిరంగంగా ప్రకటించాలి’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లుగా ఎస్సీ సర్టిఫికెట్తో దళితుల అవకాశాలు దోచుకున్న దోపిడీదారుడు కడి యం శ్రీహరి అని ధ్వజమెత్తారు. కావ్య ము స్లిం రిజర్వేషన్ ప్రకారం వివాహం చేసుకుంటే ఆమె ఎస్సీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కావ్యకు పోటీ చేసే అర్హత లేదని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేత మందకుమార్ మాదిగ పాల్గొన్నారు.