ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూత
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
ఉపకరణాలు, అభ్యర్థుల ఎంపిక శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మెదక్ రూరల్, మార్చి 31: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తున్నదని చెప్పారు. బుధవారం దివ్యాంగులకు ఉపకరణాలు అందజేయడానికి అభ్యర్థుల ఎంపిక కోసం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు, చంక కర్రలు ఇచ్చేందుకుగాను అర్హులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన శిబిరానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉపకరణాల కోసం సుమారు 500 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వం రూ.3,016 పింఛన్ ఇస్తున్నామని, వారు స్వయం ఉపాధి పథకాలు చేపట్టడానికి సబ్సిడీతో రుణ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వివాహ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి 80 శాతం శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్కు అర్హులని, పోలియో, సెరిబ్రల్ పల్స్తో వైకల్యం కలిగినవారు చంక కర్రలు ఇస్తామన్నారు. ప్రమాదం, ఇతర కారణాలతో కాళ్లు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవం అమర్చడానికి కొలతలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన వారిని గుర్తించి త్వరలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ శిబిరం ఏర్పాటుకు అనూహ్య స్పం దన లభించిందని, ఇక్కడకు వచ్చిన ప్రతిఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నిబంధనల మేరకు అర్హులైన వారికి ఉపకరణాలు త్వరలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి పద్మ, జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, లబ్ధిదారులు, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు.