పుణె: ఐపీఎల్ 14వ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయానికి గురైన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ బెయిర్ స్టో కొట్టిన బంతిని ఆపే క్రమంలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డైవ్ పడ్డాడు. భారం మొత్తం భుజంపై పడడంతో నొప్పితో విలవిల్లాడాడు. అయ్యర్ ఎడమ భుజంలో ఎముక పక్కకు జరిగిందని బీసీసీఐ సైతం తెలిపింది. ప్రస్తుతం అయ్యర్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడని, అతడికి శస్త్రచికిత్స అవసరమని బీసీసీఐ వర్గాలు బుధవారం వెల్లడించాయి. అతడు నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిపాయి. దీంతో ఇంగ్లండ్తో మిగిలిన రెండు వన్డేలతో పాటు ఐపీఎల్ మొత్తానికి శ్రేయస్ దూరం కానున్నాడని పేర్కొన్నాయి. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన అయ్యర్ దూరమైతే ఆ జట్టులో భారీ లోటు ఏర్పడనుంది. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, భారత్ సీనియర్ స్పిన్నర్ అశ్విన్, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ల్లో ఒకరు ఢిల్లీ సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9న ప్రారంభం కానుంది.