Lionel Messi : అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా అవతరించి ఏడాది గడిచింది. నిరుడు ఖతార్ గడ్డపై ట్రోఫీ అందుకున్న ఆ మధుర క్షణాలను కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. నిరుడు వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచినప్పటి నుంచి మెస్సీ ఆ ఆనందంలోనే తేలియాడుతున్నాడు. ట్రోఫీ సాధించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తాజాగా ఈ స్టార్ ఫుట్బాలర్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు.
అందులో ‘నా కెరీర్లోనే అత్యంత అందమైన పిచ్చితనానికి ఏడాది గడిచింది. జీవిత కాలంలో మర్చిపోలేని అద్భుత క్షణాలవి. అందరికీ హ్యాపీ యానివర్సరీ’ అని మెస్సీ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరుడు ఖతార్ ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్లో అర్జెంటీనా సారథి మెస్సీ అదరగొట్టాడు. సంచలన ఆటతో రెండోసారి జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు.
లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్(France)ను ఓడించింది. టైటిల్ పోరులో మెస్సీ రెండు గోల్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఆ క్షణంతో 35 ఏండ్ల మెస్సీ వరల్డ్ కప్ కల కూడా నెరవేరింది. ఈ దిగ్గజ ఫుట్బాలర్ 2022 వరల్డ్ కప్లో ధరించిన జెర్సీ(World Cup Jersey)లను వేలం వేశాడు. అతడి ఆరు 10 వ నంబర్ జెర్సీలను వేలం వేయగా రూ.64 కోట్లు వచ్చాయి. ఆ డబ్బులో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు మెస్సీ వెల్లడించాడు.
వరల్డ్ కప్ అనంతరం పీఎస్జీ(PSG) క్లబ్ను వీడిన మెస్సీ అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్తో ఒప్పందం చేసుకున్నాడు. మేజర్ సారగ్ లీగ్లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న మెస్సీని ప్రతిష్ఠాత్మక ‘బాలన్ డీ ఓర్'(Ballon d’Or) అవార్డు వరించింది. అతడు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం.