Nizamabad | నిజామాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కలకలం రేపుతున్నది. జల్సాలకు అలవాటు పడిన ఓ సైకో తన స్నేహితుడుసహా ఆరుగురిని హత్య చేశాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు, ఇద్దరు యువతులతోపాటు దంపతులను పొట్టనబెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటనతో మాక్లూర్ గ్రామం ఉలిక్కిపడింది.
సినీఫక్కీలో జరిగిన ఈ హత్యలు సంచలనంగా మారాయి. హత్య చేసిన నిందితుల్లో ప్రశాంత్ అనే వ్యక్తికి 25 ఏండ్లు కాగా.. మిగిలిన ఇద్దరు మైనర్లుగా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రశాంత్.. నవంబర్ 28 నుంచి వరుసగా ఈ హత్యలను ముగ్గురు దుండగులతో కలిసి చేసినట్టు తెలుస్తున్నది. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన ఘర్షణ మూలంగానే హత్యోదంతం దాకా వచ్చినట్టు తెలుస్తున్నది.
స్వగ్రామం వదిలి సుదూరంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో కుటుంబంతో బతుకుతున్న ప్రసాద్తో కుట్రపూరితంగా స్నేహం చేసిన ప్రశాంత్ తాను అనుకొన్న పథకం ప్రకారమే హత్యలు చేసినట్టు సమాచారం. స్నేహితుడు ప్రసాద్ ఆస్తిని కొల్లగొట్టాలనే కుట్రతో ఇదంతా చేసినట్టు స్పష్టమవుతున్నది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో డిసెంబర్ 14న వెలుగు చూసిన ఓ యువతి మృతదేహంతో అప్రమత్తమైన పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడింది.
సీరియల్ హత్యల వెనుక నేపథ్యమిది
పోలీసులు, మాక్లూర్ గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం హంతకుడు ప్రశాంత్, హత్యకు గురైన ప్రసాద్ కుటుంబానిది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రమే స్వగ్రామం. రాచర్లకూన ప్రసాద్ అనే వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి రెండేండ్ల క్రితం సొంతూరికి తిరిగొచ్చాడు. గల్ఫ్లో ఉన్నప్పుడే ప్రసాద్ మూలంగా మోసపోయిన ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొన్నది.
ఈ ఘటనతో ప్రసాద్ కుటుంబం ఇల్లు వదిలి వేరే గ్రామానికెళ్లి స్థిరపడింది. ప్రసాద్ తన పేరిట ఉన్న ఎకరం భూమిని బాధిత కుటుంబానికి రాసిచ్చి ఈ వ్యవహారాన్ని ముగించుకొన్నాడు. ఓ అమాయక యువతి ప్రాణాలను బలిగొన్న కారణంగా గ్రామంలో ప్రసాద్ కుటుంబంతో ఎవ్వరూ సత్సంబంధాలు పెట్టుకోకపోవడంతో కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి వెళ్లి తన కుటుంబంతో ప్రసాద్ బతుకుతున్నాడు.
ఈ సమయంలో స్వగ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కుటుంబ పోషణకు అప్పు కోసం చూస్తున్న సమయంలో ప్రసాద్కు ప్రశాంత్ దగ్గరయ్యాడు. యువతి మృతి కేసులో నిందితుడిగా ఉన్నందున ఆస్తి బదలాయింపు కష్టం అవుతుందని చెప్పి తన పేరిట ఆస్తులు రాసిస్తే లోన్ ఇప్పిస్తానంటూ ప్రసాద్ను ప్రశాంత్ నమ్మబలికాడు. ఇదంతా నిజమేనని నమ్మి తన రెండు ఇండ్లు, ఒక ప్లాట్ను రాసిచ్చాడు. కొద్దిరోజులకు ప్రసాద్కు చెందిన ఒక ఇంటిని చెప్పా పెట్టకుండా వేరే వ్యక్తికి ప్రశాంత్ విక్రయించాడు.
ఈ విషయం తెలియడంతో ప్రశాంత్ను ప్రసాద్ నిలదీశాడు. ఇరువురి మధ్య కొద్దికాలంలోనే మొదలైన స్నేహం కాస్తా తీవ్ర వైరంగా మారింది. ఇల్లు విక్రయానికి సంబంధించిన డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తనకు రాజకీయ ప్రాబల్యం ఉందంటూ ప్రశాంత్ బెదిరింపులకు దిగాడు. వారం, పది రోజులుగా ఇరువురి మధ్య జరుగుతున్న జగడం ముదరడంతో ప్రసాద్ను, ఆయన కుటుంబాన్ని మట్టుపెట్టాలని ప్రశాంత్ నిర్ణయించుకొన్నాడు. స్థిరాస్తికి సంబంధించి హక్కుదారులెవ్వరూ ఉండకూడదని భావించి కుటుంబం మొత్తాన్ని హత్యచేయాలని నిర్ణయానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఎలా హత్యచేశాడంటే?
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44కు ఐదు కిలో మీటర్ల దూరంలో డిసెంబర్ 14న హత్యకు గురైన దివ్యాంగురాలైన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లైంగికదాడి చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల సీసీ టీవీలను పరిశీలించగా ఒక అనుమానాస్పద కారును గుర్తించినట్టు తెలిసింది. ఈ కారు నంబర్తోపాటు సెల్ఫోన్ సిగ్నల్ డాటాను విశ్లేషించగా మాక్లూర్ మండలంలోని ప్రశాంత్ అనే యువకుడికి సంబంధించిన ఆనవాళ్లు బహిర్గతం అయ్యాయి. సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు హత్యా వివరాలు ఇలా ఉన్నాయి.
1. డబ్బులిస్తానని నమ్మబలికి తొలుత రాచర్లకూన ప్రసాద్ను ప్రశాంత్ తన వెంట తీసుకెళ్లాడు. డిచ్పల్లి హైవే పక్కన హత్య చేశాడు. అక్కడే పూడ్చిపెట్టాడు.
2. కొన్నిరోజులుగా ప్రసాద్ కనిపించకపోవడంతో అప్పులిచ్చినవారు అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని వెంటనే పోలీస్స్టేషన్కు రావాలని ప్రసాద్ భార్య రమణిని నమ్మించాడు. తన వెంట తీసుకొని వెళ్లి బాసర వద్ద హత్యచేసి, గోదావరిలో పడేశాడు.
3. ప్రసాద్, అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి ప్రసాద్ చెల్లి స్వప్న (దివ్యాంగురాలు)ను తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని కనిపించకుండా చేశాడు.
4. ప్రసాద్ తల్లికి మాయమాటలు చెప్పి అతడి పిల్లలిద్దరినీ నిజామాబాద్, నిర్మల్ జిల్లా సరిహద్దులోని సోన్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి కిరాతకంగా చంపేసి, మృతదేహాలను కాలువలో పడేశాడు. అందులో ఒక మృతదేహం ఈ నెల 8న లభించగా, సోమవారం మరో మృతదేహం దొరికింది.
5. వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారని నమ్మించి ప్రసాద్ మరో చెల్లి స్రవంతిని ప్రశాంత్ తన వెంట తీసుకెళ్లాడు. ఆమెకు నిప్పంటించి చంపేశాడు.
కూపీ లాగితే కదిలిన డొంక
ప్రసాద్, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారని నమ్మబలికి ప్రసాద్ ఇద్దరి చెల్లెళ్లు స్వప్న (దివ్యాంగురాలు), స్రవంతిని వేర్వేరుగా హంతకులు చంపేశారు. ఇందులో ఒకరి మృతదేహం భూంపల్లి శివారులో దొరకడంతోనే ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. వరుసగా మొదటి మూడు హత్యలను ప్రశాంత్ ఒక్కడే చేసినట్టుగా తెలుస్తున్నది. మిగిలిన హత్యలను ప్రశాంత్ సన్నిహితులైన మైనర్లు చేసినట్టు సమాచారం. నిందితులను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
త్వరలోనే పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఆరుగురి హత్య ఉదంతంలో డిసెంబర్ 8న ప్రసాద్ కూతురు చైత్రిక, డిసెంబర్ 5న చేగుంటలో చెల్లె స్రవంతి, డిసెంబర్ 14న భూంపల్లిలో మరో చెల్లె స్వప్న (దివ్యాంగురాలు), డిసెంబర్ 18న కుమారుడు చైత్రిక్ మృతదేహాలను సోన్ బ్రిడ్జి(నిజామాబాద్ – నిర్మల్ సరిహద్దు) వద్ద పోలీసులు గుర్తించారు. ప్రసాద్, రమణి మృతదేహాలను వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు.
మోసాలకు కేరాఫ్ ప్రశాంత్
సీరియల్ కిల్లర్ ప్రశాంత్ వయసు 25 ఏండ్లే. పేద కుటుంబమే అయినా జల్సాలు చేసేవాడు. కొత్త కార్లు, బైక్లను కొని గ్రామంలో షో చేస్తుండటంతో కొంత మందిలో అతడిని ఫాలోఅయ్యేవారు. చిన్న వయసులోనే మాయమాటలు చెప్పడంలో ఆరితేరిన ప్రశాంత్కు ఇంతకు మునుపు భూ లావాదేవీల విషయంలో పదుల సంఖ్యలో ప్రజలను మోసం చేసిన చరిత్ర ఉన్నది. వ్యవసాయ భూములకు రుణాలు ఇప్పిస్తానంటూ తన పేరిట ఆస్తులను రాయించుకోవడం.. వాటిని వేరే వ్యక్తులకు అమ్మేసి జల్సాలు చేయడం రివాజుగా మారింది.
ఎవరైనా ప్రశ్నిస్తే తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటూ పలువురి ఫొటోలు చూపిస్తూ బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారింది. మొన్నటి వరకు సైకిల్ కూడా లేని వ్యక్తి ఒక్కసారిగా కొత్త కారు, హైఫై సోకులను చూసి అమాయకులు అతరి బుట్టలో పడిపోయారు. ఇలా చాలా మంది మోసపోయి లబోదిబోమనగా ప్రసాద్ కుటుంబమైతే ఏకంగా ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రశాంత్ నడిపించిన భూ దందాల్లో లోతుగా విచారణ చేస్తే మరికొంతమంది అదృశ్యమైన వ్యక్తుల వివరాలు బయటపడే అవకాశాలున్నట్టు మాక్లూర్ ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రశాంత్ చేతిలో హత్యకు గురైన ప్రసాద్ సైతం గతంలో ఒక యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు కాగా పలువురిని మోసం చేసిన కేసుల్లోనూ ముద్దాయి కావడం విశేషం.