న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ‘ఈ పోటీలకు అభిమానులను అనుమతిస్తాం. కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నా.. యూఏఈ ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ లీగ్ను నిర్వహిస్తాం. నేటి నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి’ అని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేందుకు అభిమానులను అనుమతించడం ఇదే తొలిసారి కానుంది. అయితే మ్యాచ్కు ఎంత మందిని అనుమతిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.