Tokyo Olympics : సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వే చైనా(China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఈసారి ఏకంగా డోప్ టెస్టు(Dope Test)లో పట్టుబడిన అథ్లెట్లతో ఒలింపిక్స్లో పతకాలు కొల్లగొట్టింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 23 మంది స్విమ్మర్లు (Swimmers) చైనాకు మెడల్స్ అందించారు. ఇంత దారుణానికి పాల్పడిన చైనా దుర్బుద్ది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టోక్యో వేదికగా జరిగిన 2020 ఒలింపిక్స్(Tokyo Olympics)లో చైనా స్విమ్వర్లు నిషేధిత డ్రగ్ తీసుకొని దొరికిపోయారు. అయితే.. కలుషిత పదార్ధం కారణంగా డోప్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని చైనా అధికారులు నమ్మబలికారు. ఇదే విషయాన్ని వాళ్లు తమకు చెప్పినట్టు అంతర్జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ వాడా(WADA) తాజాగా వెల్లడించింది.
జపాన్ 2020లో ఆతిథ్యమిచ్చిన విశ్వక్రీడల్లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నారనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.చైనా స్విమ్మర్లు 23 మంది నిషేధిత ట్రైమెటజిడినె(TMZ) అనే డ్రగ్ ఉపయోగించారని మీడియా కోడై కూసింది. కరోనా మహమ్మారి విజృంభించిన ఆ సమయంలో గుండె ఆరోగ్యం కోసం టీఎంజడ్ డ్రగ్ను వాడేవాళ్లు. అయితే.. వాళ్లను చైనా బృందం వాడా కళ్లుగప్పి మరీ విశ్వక్రీడలకు పంపింది. ఆ ఏడాది 30 మంది స్విమ్మర్లతో కూడిన చైనా బృందం ఏకంగా ఆరు మెడల్స్ సాధించింది. అందులో మూడు బంగారు పతకాలు కూడా ఉన్నాయి.