Shreyas Iyer: గతేడాది వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని ఆసియా కప్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వన్డే వరల్డ్ కప్లో అంచనాలకు మించి రాణించాడు. కానీ అదే ఊపును ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికాతో సిరీస్లో మాత్రం చూపించలేకపోయాడు. రెండు టెస్టులు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన అయ్యర్.. ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో స్వదేశంలో అఫ్గాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో సెలక్టర్లు అతడిని పక్కనబెట్టారు. త్వరలో ఇంగ్లండ్తో జరగాల్సి ఉన్న టెస్టు సిరీస్ కోసం ప్రిపేర్ కావాలని ఆదేశాలు జారీ చేయగా అతడు రంజీ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ముంబై తరఫున ఆంధ్రాతో ముగిసిన మ్యాచ్లో పాల్గొన్న అయ్యర్.. 48 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ముగిశాక ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన అయ్యర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్లో తాను అగ్రెసివ్ క్రికెట్ ఆడతానని, తనకు బాల్స్ను వదిలేయడం బోర్ అని చెప్పుకొచ్చాడు.
అయ్యర్ మాట్లాడుతూ… ‘ఇంగ్లండ్తో రాబోయే సిరీస్లో నేను అటాకింగ్ క్రికెట్ ఆడతా. పరిస్థితులు ఎలా ఉన్నా నేను మాత్రం దూకుడుగా ఆడేందుకు యత్నిస్తా. డిఫెన్స్ మోడ్లో ఆడితే జట్టును ఒక దశ చేరేదాకా అదే విధంగా ఆడాల్సి ఉంటుంది. నేను ఎన్ని పరుగులు చేశాననేకంటే ఎలా ఆడానన్నది ముఖ్యం. రంజీ మ్యాచ్లో నేను చేసింది తక్కువ స్కోరే అయినా నా ఆట పట్ల నేను సంతృప్తిగా ఉన్నా. బౌలర్లు నాకు పదే పదే షార్ట్ బాల్స్ (అయ్యర్ వీక్నెస్ అదే) వేసినా నేను సమర్థవంతంగా ఎదుర్కున్నా. వాస్తవంగా చెప్పాలంటే బాల్ను వదిలేయడం నాకు నచ్చదు. ఊరికే వదిలేయడం కంటే ఏదో విధంగా ఆడాలనే ప్రయత్నిస్తా. అలా వదిలేయడం నాకు బోర్గా ఉంటుంది..’ అని అన్నాడు.
Shreyas Iyer facing as many balls as he can before the Tests begin #INDvENG pic.twitter.com/ryPjPE6iDc
— ESPNcricinfo (@ESPNcricinfo) January 15, 2024
జట్టులో పోటీ పైనా అయ్యర్ స్పందించాడు. కెఎల్ రాహుల్ను ఇంగ్లండ్తో సిరీస్ ప్యూర్ బ్యాటర్గా ఆడించాలని టీమిండియా భావిస్తున్నది. వికెట్ కీపర్గా కోన శ్రీకర్ భరత్ లేదా కొత్త కుర్రాడు ధ్రువ్ జురెల్కు ఛాన్స్ దక్కొచ్చన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్.. స్పెషలిస్టు బ్యాటర్గానే జట్టులో కొనసాగుతాడు. అతడికి తోడు రంజీ మ్యాచ్లలో పుజారా తిరిగి ఫామ్ను సంతరించుకున్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదం కారణంగా ఆటకు దూరమైన రిషభ్ పంత్ కూడా కోలుకుంటున్నాడు. వీళ్లంతా జట్టులోకి వస్తే అయ్యర్కు ప్లేస్ అనుమానమే. ఇంగ్లండ్తో సిరీస్లో రాణిస్తేనే అయ్యర్కు మెరుగైన అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో అయ్యర్ స్పందిస్తూ… పోటీ ఎక్కువున్నప్పుడే ఆటగాళ్ల నుంచి అసలైన ఆట బయటకు వస్తుందని అయ్యర్ అన్నాడు.