ODI WC 2023 : ప్రపంచ కప్లో భారత్(India)-పాకిస్థాన్(Pakistan) మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరుజట్లు అక్టోబరు 15న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం(Narendar Modi Stadium)లో తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు తలపడే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, భద్రతా పరమైన కారణాలతో ఈ మ్యాచ్ను రీ-షెడ్యూల్(Re-schedule) చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఊహాగానాలపై బీసీసీఐ కార్యదర్శి జై షా(Jai Shah) స్పందించారు. మ్యాచ్ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని అంగీకరిస్తూనే అందుకు కారణాలు మాత్రం అవి కావని స్పష్టం చేశారు. షెడ్యూల్లోని కొన్ని తేదీలను మార్చాలంటూ పూర్తి సభ్యదేశాలు అభ్యర్థించినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం
అక్టోబరు 5న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్తో ప్రపంచకప్ ప్రారంభం అవుతుంది. అదే నెల 15న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే, అదే రోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాబట్టి భారత్-పాక్ మ్యాచ్ ఆ రోజున ఉంటే సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానిక పోలీసులు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లారు.
బీసీసీఐ కార్యదర్శి జై షా
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈ నెల 27న జరిగిన సమావేశంలో షా మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐసీసీతో సంప్రదింపులు జరిపిన తర్వాత సవరించిన షెడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పారు. అయితే, ఏ మ్యాచ్ను రీషెడ్యూల్ చేస్తామన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు భద్రత పరంగా ఎలాంటి సమస్యా లేదని షా స్పష్టం చేశారు. ఒకవేళ అదే కారణం అయితే వేదిక మార్చకుండా.. అక్కడే ఎందుకు నిర్వహిస్తామని ప్రశ్నించారు. కొన్ని మ్యాచ్ల మధ్య రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉందని, ఒక మ్యాచ్ ఆడిన జట్టు మరో మ్యాచ్ కోసం తర్వాతి రోజు ప్రయాణించి మ్యాచ్ ఆడడంలో ఇబ్బందులు ఉంటాయన్నారు. మ్యాచ్ వేదికల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, అయితే.. తేదీల్లో మాత్రమే మార్పు ఉండొచ్చని జై షా(Jai Shah) తెలిపాడు.