ఫఖర్ రనౌట్పై వివాదం
జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఫఖర్ జమాన్ రనౌటైన తీరుతో క్రీడాస్ఫూర్తి అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 193 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న ఫఖర్ రెండో పరుగు పూర్తి చేసేందుకు స్ట్రైకింగ్ ఎండ్వైపునకు పరుగెత్తుకొచ్చాడు. ఆ సమయంలో సఫారీ కీపర్ డికాక్.. త్రో బౌలింగ్ ఎండ్కు వెళుతుందన్నట్టు సైగలు చేశాడు. దీంతో ఫఖర్ తిరిగి చూడగా.. స్ట్రయికింగ్ ఎండ్లోని వికెట్లను మార్క్మ్ నేరుగా గిరాటేశాడు. దీంతో ద్విశతకం ముంగిట ఫఖర్ ఔటయ్యాడు. డికాక్ కావాలనే జమాన్ను తప్పుదోవ పట్టించాడని, క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్ధమని పాక్ మాజీ పేసర్ అక్తర్ సహా మరికొందరు విమర్శించారు. మరోవైపు ఈ విషయంలో అతడి తప్పేమీ లేదని దక్షిణాఫ్రికా స్పిన్నర్ శంసీతో పాటు ఇంకొందరు అభిప్రాయపడ్డారు. వివాదం ముదరడంతో స్పందించిన మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్సీసీ) .. ఈ విషయంపై ఫీల్డ్ అంపైర్లదే తుది నిర్ణయమని చెప్పింది. కాగా.. వెనక్కి తిరిగి చూడడం తన తప్పేనని ఈ విషయంలో డికాక్ను నిందించేందుకు ఏం లేదని ఫఖర్ చెప్పాడు. జమాన్ పోరాడినా రెండో వన్డేలో పాక్ 22 పరుగుల తేడాతో ఓడింది.
మరిన్ని వార్తలు చదవండి..
బీసీసీఐ ఏసీయూ చీఫ్గా మాజీ డీజీపీ