IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఆ జట్టులో దంచికొట్టే దమ్మున్న ఆటగాళ్లు ఎందరున్నా సరే.. లక్నోబౌలర్లు మడతపెట్టేస్తున్నారు. అవును.. కేఎల్ రాహుల్(KL Rahul) సారథ్యంలోని లక్నో జట్టు ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ వస్తున్న రాహుల్ సేన గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసి విజయాల హ్యాట్రిక్ కొట్టింది. దాంతో, అందరూ రాహుల్ను కాబోయే ‘డిఫెన్స్ మినిస్టర్’ (Defence Minister) అంటూ ఆటపట్టిస్తున్నారు.
సొంత గడ్డపై ఆల్రౌండ్ షోతో గుజరాత్ను లక్నో కట్టడి చేసింది. పేసర్ యశ్ ఠాకూర్(30/5), కృనాల్ పాండ్యా(11/3)ల ధాటికి గుజారాత్ కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రాహుల్, ఇన్ఫ్లుయెన్సర్ శుభ్మన్ గౌర్(Shubman Gaur) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆ ఫన్నీ వీడియోను లక్నో ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందంటే.. కంగ్రాట్స్ రాహుల్. నాకెందుకో నువ్వు డిఫెన్స్ మినిస్టర్ అవుతావని అనిపిస్తోంది అని శుభ్మన్ గౌర్ అంటాడు.
13-0 when defending 160+ 💙🔥 pic.twitter.com/Zt67qS7p15
— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2024
అందుకు రాహుల్ నవ్వుకుంటూ.. ‘నువ్వు నా స్ట్రయిక్ రేటుపై జోక్ చేస్తున్నావ్ కదా’ అని బదులిస్తాడు. ‘అయ్యో.. అదేం కాదు. మీ జట్టు విజయవంతంగా 160 టార్గెట్ను కాపాడుకుంది. అందుకని మీరు కాబోయే డిఫెన్స్ మినిస్టర్ అని సరదాగా అన్నాను’ అని గౌతమ్ అంటాడు. దాంతో, ఇద్దరూ పగలబడి నవ్వారు. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం ‘ఔను నిజమే రాహుల్ డిఫెన్స్ మినిస్టర్ అవుతాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్లో ఏ కెప్టెన్ అయినా ఛేజింగ్కే మొగ్గు చూపుతాడు. కానీ, రాహుల్ తీరే వేరు. జట్టులో డికాక్, స్టోయినిస్, పూరన్ వంటి హిట్టర్లు ఉన్నా సరే అతడు ఫస్ట్ బ్యాటింగే ముద్దంటున్నాడు. ఎందుకంటే.. అతడికి సైన్యంలో నిప్పులు చెరిగే ‘ఢిల్లీ ఎక్స్ప్రెస్’ మయాంక్ యాదవ్(Mayank Yadav).. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ నవీన్ ఉల్ హక్, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే యశ్ ఠాకూర్ ఉన్నారు.
ఇక స్పిన్ మాంత్రికులు రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యాలు ప్రత్యర్థి జోరుకు పగ్గాలు వేస్తున్నారు. దాంతో, పంజాబ్ కింగ్స్పై 199 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న లక్నో.. ఆ తర్వాత 181 పరుగుల ఛేదనలో ఆర్సీబీని 153కే కట్టడి చేసింది. ఆదివారం గుజరాత్ను సైతం 33 పరుగుల తేడాతో ఓడించిన రాహుల్ సేన హ్యాట్రిక్ కొట్టింది. ఏకంగా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఏప్రిల్ 12వ తేదీన జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో తలపడనుంది.